చంద్రబాబుకు సమయం వచ్చిందా ?

ఎంతసేపు రౌడీయిజంతో గెలిచారు, ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని గెలిచారు అనే అరిగిపోయిన రికార్డు వేసినందు వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబునాయుడు గ్రహించాలి. పంచాయితి ఎన్నికల్లో మద్దతుదారులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని నిజాయితిగా విశ్లేషించుకోవాలి. పార్టీ తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అప్పుడే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోగలరు.

అలా కాకుండా ఎంతసేపు అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ గెలిచిందని చెప్పటం వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబు ఎంత తొందరగా గ్రహిస్తే అంతమంచిది. అధికారంలో ఉన్నపుడు ఏ పార్టీ అయినా ఇలాగే వ్యవహరిస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నికలు, నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ ఎలా గెలిచిందో అందరికీ తెలిసిందే.

కాబట్టి అధాకార దుర్వినియోగం గురించి మాట్లాడటం మానేసి పార్టీ నేతల వైఫల్యాల గురించి నిజాయితిగా విశ్లేషించుకోవాలి. మొన్నటి పంచాయితి ఎన్నికల్లో కుప్పంలో ఏమి జరిగింది ? తమను ఒత్తిడి పెట్టి ఇష్టం లేకపోయినా ఎన్నికల్లో దింపిన నేతలు చివరకు అడ్రస్ లేకుండా పోయారంటూ ఓడిపోయిన అభ్యర్ధులు బహిరంగంగానే ముగ్గురు నేతలపై విరుచుకుపడ్డారు.

ఇపుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమికి నేతల మధ్య సమన్వయ లోపం కూడా కారణమనే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ రకాల పదవులు అనుభవించి, ఆర్ధికంగా బలోపేతమైన నేతల్లో చాలామంది ఇపుడు కూడా పెద్దగా ఫీల్డు మీద కనబడలేదు. పోటీ చేసిన అభ్యర్ధులకు మద్దతుగా రంగంలోకి దిగలేదు. నేతలంతా సమిష్టిగా, చిత్తశుద్దితో గెలుపుకు కష్టపడుంటే ఇంకా మంచి ఫలితాలే వచ్చుండేవి.

ఓడిపోయిన మున్సిపాలిటిలను గెలిచిన తాడిపత్రి, మైదుకూరు ఫలితాలతో చంద్రబాబు భేరీజు వేసుకోవాలి. గెలిచిన రెండు మున్సిపాలిటిల్లో ఎలా గెలిచింది ? ఓడిపోయిన మిగిలిన మున్సిపాలిటీల్లో ఎందుకు ఓడిపోయిందనే విషయాన్ని చంద్రబాబు నిజాయితిగా విశ్లేషిస్తే కారణాలు అవే తెలుస్తాయి. పోలింగ్ కు ముందు విజయవాడలోని నేతల మధ్య బయటపడిన ఆధిపత్య గొడవల్లాంటివే చాలా మున్సిపాలిటిల్లో బయటపడ్డాయట.

ఇలాంటి అనేక కారణాలే పార్టీ కొంప ముంచేశాయి. కాబట్టి ఓటమికి వైసీపీ అధికార దుర్వినియోగమే కారణమని సర్దిచెప్పుకుంటే పార్టీకి భవిష్యత్తే ఉండదు. ఇప్పటి నుండే ఏ ఎన్నిక జరిగినా ఫలితం ఇలాగే రిపీటవుతుందనటంలో సందేహం లేదు.