రాష్ట్రంలో ఎక్క‌డ ఓడినా ఫ‌ర్లేదు.. కానీ..

స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం వెనుక ఏం జ‌రిగింది ? ప‌్ర‌జ‌లు సంపూర్ణంగా.. టీడీపీని తిర‌స్క‌రించారా ? లేక‌.. పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. ఆధిప‌త్య జోరు.. అధినేత‌పై అల‌క‌లు.. వంటివి బాగా ప‌నిచేశాయా ? అనే విష‌యాల‌పై ఇప్పుడు పార్టీలో అంత‌ర్మ‌థ‌నం జ‌రుగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఎక్క‌డ పోయినా.. ఫ‌ర్లేదు.. ఈ మూడు మాత్రం పార్టీకి ప్రాణ‌ప్ర‌దం.. అన్న చంద్ర‌బాబుకు ఆ మూడు కూడా ద‌క్క‌క పోగా.. అత్యంత ఘోర‌మైన ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది. అవే విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ‌ప‌ట్నం. రాష్ట్రంలో ఎక్క‌డ ఓడినా ఫ‌ర్లేదు.. కానీ.. ఇక్క‌డ మాత్రం విజ‌యంసాధిస్తే.. వైసీపీకి అడుగడుగునా చెక్ పెట్టొచ్చ‌ని చంద్ర‌బాబు అనుకున్నారు.

పార్టీకి కంచుకోట అనుకున్న విజ‌య‌వాడలో అత్యంత దారుణంగా పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాలు.. రెండు రోజుల్లో ఎన్నిక‌లు పెట్టుకుని కూడా ఆధిప‌త్య పోరుకోసం.. మీడియా ముందుకు వ‌చ్చి ఆరోప‌ణ‌లు చేసుకుని ప‌రువు తీసుకోవ‌డం… ఒక‌రిపై ఒక‌రు స‌వాళ్లు రువ్వుకోవ‌డం వంటివి.. పార్టీలో అనైక్య‌త‌ను కొట్టొచ్చిన‌ట్టు బ‌య‌ట పెట్టాయి. దీంతో విజ‌య‌వాడ‌లో టీడీపీని ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్ట‌డంలో ఇది కూడా కీల‌క కార‌ణంగా మారిపోయింది. ఇక‌, గుంటూరులోనూ నాయ‌కులు సొంత పార్టీకి క‌లిసి రాలేదు. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేసుకున్నారు. త‌మ అభ్య‌ర్థులు గెలిస్తే చాల‌నుకున్నారు. అంద‌రినీ క‌లుపుకొని వెళ్తామ‌నే స్ఫూర్తిని ప‌క్క‌న పెట్టారు. ప‌లితంగా గుంటూరులో టీడీపీ విజ‌యం సాధించ‌లేక పోయింది.

వాస్త‌వానికి ఇక్క‌డ‌ రాజ‌ధాని సెంటిమెంటు బ‌లంగా ఉంటుంద‌ని అనుకున్నారు. అయితే..అనూహ్యంగా ఇక్క‌డ నేత‌లు అనుస‌రించిన వైఖ‌రి.. పార్టీని దెబ్బ కొట్టింది. ఇక‌, విశాఖ విష‌యాన్ని తీసుకుంటే.. కీల‌క నాయ‌కులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గానికి రాజీనామా చేయ‌డం.. పార్టీతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం టీడీపీకి ఇబ్బందిగా మారింది. అస‌లు ఏ ద‌శ‌లోనూ గంటా శ్రీనివాస‌రావు.. విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోలేద‌నే వాద‌న ఉంది. ఇక మ‌రో ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ పార్టీ కి దూర‌మై వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో ఆయ‌న వ‌ల్ల కూడా టీడీపీ ఓటు బ్యాంకు తీవ్రంగా ప్ర‌భావిత‌మైంది.

స‌బ్బం హ‌రి మాట‌ల‌తో కాల‌క్షేపం చేసేశారు. తూర్పులో ఇర‌గ‌దీస్తాడ‌నుకున్న ఎమ్మెల్యే వెల‌గ‌పూడి సైతం ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. ఇలా.. ఈ మూడు చోట్ల కూడా టీడీపీ నాయ‌క‌త్వ లోపాలు, నేత‌ల మ‌ధ్య వివాదాలు, విభేదాలు జోరుగా ప‌నిచేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.