10 నిమిషాల సినిమా చూపించేసిన మంచు హీరో

మంచు విష్ణు కెరీర్‌కు మోస‌గాళ్ళు సినిమా ఎంత కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చివ‌ర‌గా అత‌ను ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ప్రేక్ష‌కుల‌కు గుర్తులేని స్థితిలో అత‌డి నుంచి కొంచెం ప్రామిసింగ్‌గా క‌నిపిస్తున్న సినిమా ఇదే. హాలీవుడ్ నుంచి జెఫ్రీ చిన్ అనే ద‌ర్శ‌కుడిని తీసుకొచ్చి మంచి బ‌డ్జెట్ పెట్టి.. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దిన థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ మ‌ధ్యే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఉత్కంఠ‌భ‌రితంగా అనిపించింది.

ఈ నెల 19నే మోస‌గాళ్ళు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. కొంచెం అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేయాల‌ని ఈ చిత్రానికి నిర్మాత కూడా అయిన మంచు విష్ణు నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌నో సాహ‌సం చేశాడు. సినిమాలో ప‌ది నిమిషాల కీల‌క ఎపిసోడ్‌ను మీడియా వాళ్ల‌కు చూపించాడు. వాళ్ల‌కు ఆ ఎపిసోడ్ బాగానే న‌చ్చింద‌ని అంటున్నారు. సినిమా ప‌ట్ల ఆస‌క్తిని పెంచేలా ఆ స్నీక్ పీక్ ఉంద‌ట‌.

కొత్త సినిమాల రిలీజ్ ముంగిట స్నీక్ పీక్ పేరుతో రెండు మూడు నిమిషాల నిడివితో కీల‌క స‌న్నివేశాల‌ను రిలీజ్ చేయ‌డం ప్ర‌మోష‌న్ల‌లో భాగ‌మే. త‌మిళంలో ఎక్కువ‌గా ఈ ప‌ద్ధ‌తి ఫాలో అవుతుంటారు. ఆ మ‌ధ్య బేతాళుడు అనే సినిమా నుంచి తొలి పది నిమిషాల క్లిప్ రిలీజ్ చేసి ఆస‌క్తి రేకెత్తించారు. ఐతే మంచు విష్ణు మాత్రం సామాన్య జ‌నానికి కాకుండా మీడియా వాళ్ల‌కు ప‌ది నిమిషాల ఎపిసోడ్ చూపించి వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాడు. వాళ్లంద‌రూ పాజిటివ్‌గా స్పందించ‌డంతో అత‌ను కాన్ఫిడెంట్‌గా సినిమాను రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

మీడియా వాళ్ల‌ను ఇప్పుడు ఇంప్రెస్ చేస్తే.. సినిమాను సానుకూల ధోర‌ణితో చూస్తార‌ని, సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే రివ్యూలు కూడా పాజిటివ్‌గా వ‌స్తాయని అత‌ను ఆశిస్తున్న‌ట్లున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్, న‌వ‌దీప్, న‌వీన్ చంద్ర‌, సునీల్ శెట్టి ముఖ్య పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంపై రూ.30 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టాడ‌ట మంచు విష్ణు.