జాతిరత్నాలు.. నమ్మశక్యం కాని ఘనత

‘జాతిరత్నాలు’ పేరుకే చిన్న సినిమా. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ చిత్రం పెద్ద పెద్ద ఘనతలే అందుకుంటోంది. మహాశివరాత్రి కానుకగా గురువారం విడుదలైన ఈ చిత్రం.. లాంగ్ వీకెండ్‌ను చాలా బాగా ఉపయోగించుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఆదివారం నుంచి ఈ చిత్రం లాభాలు అందుకుంటోంది.

ఇక టాలీవుడ్‌కు అమితానందాన్నిస్తున్న విషయం ఏంటంటే.. స్తబ్దుగా ఉన్న యుఎస్ మార్కెట్‌‌లో సైతం ‘జాతిరత్నాలు’ ఊపు తీసుకొచ్చింది. ఒకప్పుడు మిలియన్లకు మిలియన్లు కొల్లగొట్టుకున్న తెలుగు సినిమాలకు యుఎస్‌లో ఇప్పుడంతగా వసూళ్లు రావట్లేదు. తెలుగు సినిమా అనే కాదు.. అన్ని చిత్రాలకూ వసూళ్లు పడిపోయాయి. కరోనా ప్రభావం ఇంకా పోకపోవడంతో తక్కువ లొకేషన్లలోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లు చాలా వరకు మూత పడి ఉన్నాయి. తెరిచిన థియేటర్లలో కూడా జనాలు వచ్చి పెద్దగా సినిమాలు చూడలేదు ఇన్నాళ్లూ.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్ అయిన ‘ఉప్పెన’కు కూడా 2 లక్షల డాలర్ల లోపే వసూళ్లు వచ్చాయి. కానీ ‘జాతిరత్నాలు’తో కథ మారిపోయింది. ఈ సినిమా కోసం అక్కడి జనాలు ఎగబడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సినిమా చూస్తున్నారు. దీంతో ప్రిమియర్స్ నుంచే ‘జాతిరత్నాలు’ 1.33 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. కరోనా విరామం తర్వాత ఓ ఇండియన్ సినిమాకు వచ్చిన అత్యధిక ప్రిమియర్ వసూళ్లు ఇవే. తర్వాతి రోజుల్లో కూడా జోరు కొనసాగించింది. శనివారానికే ‘జాతిరత్నాలు’ 5.38 లక్షల డాలర్లు రాబట్టింది.

దీంతో కరోనా బ్రేక్ తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన భారతీయ చిత్రంగానూ ఇది రికార్డులకెక్కింది. ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రం నెలకొల్పిన రికార్డును.. వీకెండ్లోనే ఇది బద్దలు కొట్టడం నమ్మశక్యం కాని విషయమే. ఆదివారం వసూళ్లతో హాఫ్ మిలియన్ మార్కును దాటేయబోతున్న ‘జాతిరత్నాలు’ ఫుల్ రన్లో 8 లక్షల డాలర్ల వరకు కలెక్ట్ చేసే అవకాశముంది.