విజయవాడ : వైసీపీ గెలిస్తే ఏం జరుగుతుంది, టీడీపీ గెలిస్తే ఏం జరుగుతుంది?

రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మూడు కార్పొరేష‌న్లు అత్యంత కీల‌కంగా మారాయి. విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌నే విష‌యంతోపాటు.. ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటే.. రాష్ట్రానికి ఏవిధంగా మేలు జ‌రుగుతుంది? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వీటిలో విజ‌య‌వాడ మ‌రింత కీల‌కంగా మారింది. రాష్ట్ర వాణిజ్య రాజ ధానిగా పేరున్న విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య తీవ్ర స్థాయిలో యుద్ధానికి దారితీశాయి. ఇక్క‌డ ఎలాగైనా ప‌ట్టు సాధించి.. తాము ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానుల‌కు విజ‌య‌వాడ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార‌ని ప్ర‌చారం చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది.

ఈ క్ర‌మంలో కీల‌క‌మైన మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితోపాటు కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని, ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కం మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌లు ఇక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించారు. పెద్దిరెడ్డి తెర‌వెనుక ఉండి వ్యూహం ర‌చించ‌గా.. ఇద్ద‌రు మంత్రులు దీనిని అమ‌లు చేశారు.

ఇక‌, తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్‌కు పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. యువ‌త‌ను స‌మీక‌రించ‌డంతోపాటు.. ఆయ‌న ప్ర‌తి ఇంటికీ తిరిగారు. దీంతో వైసీపీ ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం త‌థ్య‌మ‌నే వాద‌న ఉంది. దీంతో మూడు రాజ‌ధానుల‌కు ప్ర‌జ‌లు జై కొట్టిన‌ట్టు పార్టీ నేత‌లు ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఫ‌లితంగా ఇక‌, మీద‌ట మూడు రాజ‌ధానుల ఏర్పాటు ప్ర‌య‌త్నాలు వ‌డివ‌డిగా సాగుతాయి.

అదేస‌మ‌యంలో విజ‌య‌వాడ అభివృద్ధి అనేది ఏమేర‌కు చేస్తార‌నేది వేచి చూడాలి. ఇక‌, వైసీపీ కాకుండా టీడీపీ క‌నుక ఇక్క‌డ విజ‌యం సాధిస్తే.. అభివృద్ధికి ఊతం ఇచ్చిన‌ట్టుగా భావించాల్సి ఉంటుంది. ప‌లు కార్య‌క్ర‌మాలు ముందుకు న‌డ‌వ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల‌కు బ్రేక్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ నేత‌ల దూకుడుకు కూడా క‌ళ్లెం ప‌డుతుంద‌ని అంటున్నారు.

ముఖ్యంగా కార్పొరేష‌న్‌లో టీడీపీ పాగా వేయ‌డం ద్వారా.. అన్నా క్యాంటీన్లు తిరిగి తెర‌వ‌డంతోపాటు.. ఇక్క‌డ ఇంటి ప‌న్నుల పెంపు భారం కూడా త‌మకు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. గ‌త 2014 ఎన్నిక‌ల్లో శివారు ప్రాంతాలు స‌హా విజ‌య‌వాడ న‌గరంలో మాస్ ఓటింగ్ ఎక్కువ‌గా జ‌ర‌గ్గా.. ఈ ద‌ఫా క్లాస్ ఓట‌ర్లు క్యూ క‌ట్టారు. ఇది వైసీపీలో గుబులుకు దారితీసింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.