వాణిదేవి గెలుపు కోసం గులాబీ బాస్.. ఇంతలా ఎప్పుడూ చేయలేదే?

ఇవాల్టి పేపర్లు చూశారా? ఒక ఆసక్తికర అంశం ఉంది. టీఆర్ఎస్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో.. ఒక అభ్యర్థి కోసం ఇంతలా ప్రచారం ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. తమకు ఎంతమాత్రం అచ్చిరాని హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా తెలంగాణ అధికార పార్టీ ఉందని చెప్పాలి. ఇందుకు తగ్గట్లే.. ఈ రోజు దాదాపు అన్ని ప్రధానపత్రికల్లో (తెలుగు..ఇంగ్లిషుతో సహా) జాకెట్ యాడ్ గా వచ్చిన వైనం ఆసక్తికరమని చెప్పాలి.

దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తె కమ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి విజయాన్ని కాంక్షిస్తూ.. ఆమెకు ఓటు వేయాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ స్వయంగా యాడ్ ఇచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఒక అభ్యర్థి కోసం పార్టీనే స్వయంగా ఇంత భారీ ఎత్తున యాడ్ ఇచ్చింది లేదు. తాజా యాడ్ లో కేవలం ముగ్గురంటే.. ముగ్గురే ఉండటం మరో విశేషంగా చెప్పాలి. పార్టీ అధినేత కేసీఆర్ ఫోటో పెద్దదిగా.. పీవీ ఫోటో అందులో పావు భాగం ఉండేలా..కేసీఆర్ ఫోటో సైజుకు దగ్గర దగ్గరగా అభ్యర్థి వాణీదేవి ఫోటోను పబ్లిష్ చేయటం విశేషం.

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం వాణీ దేవి గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలతో పోలిస్తే.. మరో ఎన్నిక గురించి పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదని చెప్పాలి. ఇదంతా చూస్తే.. వాణీదేవి గెలుపును సీఎం కేసీఆర్ ఎంత ప్రిస్టేజ్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ భారీ యాడ్ లో ఎక్కడా ప్రభుత్వ గొప్పతనం కానీ.. కేసీఆర్ నాయకత్వ ప్రతిభ గురించి కానీ ప్రస్తావించకుండా.. కేవలం ఆత్మగౌరవం.. తెలంగాణ సెంటిమెంట్.. పీవీ పేరును మాత్రమే ప్రస్తావించి ఓటు అడుగుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు. ఏమైనా ఒక ఎన్నిక కోసం.. ఒక అభ్యర్థి కోసం టీఆర్ఎస్ ఇంతలా ఎప్పుడు ఖర్చు చేయలేదని మాత్రం చెప్పక తప్పదు.