కార్తికేయతో సుకుమార్ సినిమా

ఒక సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక అనుకోని అతిథి కనిపించాడు అంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారితో తర్వాత ఆ వ్యక్తికి ఏదో ఒక భాగస్వామ్యం ఉండబోతోందని సంకేతాలు అందుతున్నట్లే. చాలా కొత్త కాంబినేషన్లు ఇలాగే బయటికి వస్తుంటాయి. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.

ఎందుకంటే అది తమ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కిన సినిమా కాబట్టి.. బన్నీ వచ్చి ప్రమోట్ చేయడం సహజమే. కానీ అదే వేడుకలో దర్శకుడు సుకుమార్ కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘పుష్ప’ పనుల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక్కడికి ఎలా వచ్చాడని చాలామంది సందేహించారు. బన్నీ, అరవింద్ అడిగితే వచ్చాడా.. లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరిగింది. ఐతే వేరే కారణంతోనే ఆ వేడుకకు సుక్కు వచ్చాడని ఇప్పుడు స్పష్టమైంది.

కార్తికేయతో సినిమా తీయడానికి సుకుమార్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఐతే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు కాదు కానీ.. ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోంది. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్న సినిమాలో కార్తికేయ హీరోగా నటించబోతున్నట్లు శుక్రవారం ప్రెస్ నోట్ బయటికి వచ్చింది. ‘సుకుమార్ రైటింగ్స్’ బేనర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. అంటే ‘కుమారి 21 ఎఫ్’ మాదిరే ఈ చిత్రానికి కూడా సుక్కు అన్నీ తానై వ్యవహరించనున్నాడన్నమాట. ఎవరో ఒక సుకుమార్ శిష్యుడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశముంది. ఆ వ్యక్తి ఎవరో ఇంకా వెల్లడించలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకే విశేషాలు, వివరాలు కూడా బయటికి రాలేదు. జస్ట్ సుకుమార్ స్క్రిప్టుతో కార్తికేయ సినిమా అనేది మాత్రమే వెల్లడైంది. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్టుతో యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్రలో ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.