రెండో పెళ్లి రూమ‌ర్‌పై మంచు మ‌నోజ్ చ‌మ‌త్కారం


మంచు కుటుంబంలో చివ‌ర‌గా పెళ్లి చేసుకున్న‌ది మంచు మ‌నోజ్. కానీ అత‌డి వైవాహిక జీవితం స‌వ్యంగా సాగ‌లేదు. ప్ర‌ణతి అనే అమ్మాయిని ప్రేమించి, పెద్ద‌ల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్న మ‌నోజ్.. మూడేళ్లు తిరిగేస‌రికి ఆమె నుంచి విడిపోయాడు. 2019లో వీళ్లిద్ద‌రికీ విడాకులు కూడా అయ్యాయి. ఈ విష‌యంలో మ‌నోజ్ కొంత కాలం మాన‌సికంగా కుంగిపోయిన‌ట్లే క‌నిపించాడు. ప‌రోక్షంగా ఆ దిశ‌గా సంకేతాలు కూడా ఇచ్చాడు.

ఐతే ఈ మ‌ధ్య ఆ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ సినిమా మొద‌లుపెట్టాడు. అహం బ్ర‌హ్మాస్మి పేరుతో తెర‌కెక్కుతున్న ఆ సినిమా చిత్రీక‌ర‌ణ మ‌ధ్య ద‌శ‌లో ఉంది. కాగా మంచు మ‌నోజ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఓ ప్ర‌చారం మొద‌లైంది. త్వ‌ర‌లోనే అతడి రెండో పెళ్లి అంటూ సోష‌ల్ మీడియాలో, వెబ్ సైట్ల‌లో జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐతే ఇలాంటి ఒక వార్త‌పై మ‌నోజ్ త‌న‌దైన శైలిలో స్పందించాడు. ఇటీవ‌లే రిలీజైన జాతిర‌త్నాలు సినిమా ట్రైల‌ర్‌లో బ్ర‌హ్మానందం పేల్చిన పంచ్‌ను గుర్తు చేస్తూ.. ఆ స్క్రీన్ షాట్లు పెట్టి డేటు, టైము కూడా మీరే చెప్పేయండి అంటూ ఫ‌న్నీ ఎమోజీలు జోడించాడు మ‌నోజ్. ఈ కామెంట్‌తో అత‌ను త‌న రెండో పెళ్లి వార్త‌ను ఖండిస్తున్నట్లా లేదా అన్న‌దిమాత్రం జ‌నాల‌కు అర్థం కావ‌డం లేదు.

ఐతే మ‌రో పెళ్లి చేసుకోవ‌డానికి వ‌య‌సు అడ్డంకి కాదని చాటుతూ.. దిల్ రాజు, సునీత లాంటి వాళ్లే ఈ మ‌ధ్య కాలంలో రెండో పెళ్లి చేసుకున్నారు. ఏ వ‌య‌సులో అయినా ఒక తోడు అవ‌స‌రం అన‌డంలో మ‌రో మాట లేదు. మంచి ఫ్యామిలీ మ్యాన్‌లా క‌నిపించే మ‌నోజ్ కూడా మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటాడ‌నే అనుకుంటున్నారు అత‌డి స‌న్నిహితులు, అభిమానులు. మ‌రి ఆ స‌మ‌యం అప్పుడే వ‌చ్చేసిందా లేక ఇంకా టైం తీసుకుంటాడా అన్న‌దే చూడాలి.