ఏపీలో ఏబీసీడీ రాజ్యం.. బాబు కామెంట్.. మేయ‌ర్ అభ్య‌ర్థి ప్ర‌క‌ట‌న‌

ప్ర‌స్తుతం విశాఖ మ‌హాన‌గ‌రాన్ని ఏ2 అనే శ‌ని ప‌ట్టింది– అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. విశాఖ కార్పొ రేష‌న్ ప‌రిధిలో టీడీపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున రెండు రోజుల పాటు ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో తొలిరోజు.. శుక్ర‌వారం ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పెందుర్తి కూడలిలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖపట్నానికి ఏ2 శని పట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని, ఏపీలో ఏబీసీడీ రాజ్యం నడుస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏ-అవినీతి, బీ-బెదిరింపులు, సీ-క్రిమిన‌ల్, డీ-దౌర్జ‌న్య పాల‌న సాగుతోంద‌ని నిప్పులు చెరిగారు.

దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండమైన‌ విజయం అందించాలని విశాఖ వాసుల‌ను ఆయ‌న‌ కోరారు. నీతి, నిజాయితీకి విశాఖ మారు పేరు అని వ్యాఖ్యానించారు. విశాఖ అభివృద్ధికి టీడీపీ ఎంతో కష్టపడిందని చంద్రబాబు తెలిపారు. హుద్‌హుద్ సమయంలో విశాఖ కోసం ఎంతో కష్టపడ్డామన్నారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ‌ను అభివృద్ధి చేసే శ‌క్తి, సామ‌ర్థ్యం టీడీపీకే ఉన్నాయ‌ని.. చంద్ర‌బాబు చెప్పారు. త‌మ పాల‌న‌లో విశాఖ‌ను ప్ర‌పంచ ప‌టంలో పెట్టామ‌న్న చంద్ర‌బాబు.. అభివృద్ధికి మాస్ట‌ర్ ప్లాన్ కూడా రెడీ చేశామ‌ని వివ‌రించారు.

పీలాకే ప‌ట్టం..
ఇక‌, విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌త కొన్నాళ్లుగా టీడీపీలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు చంద్ర‌బాబు తెర‌దించారు. ఇక్క‌డి మేయ‌ర్ అభ్య‌ర్థిపై ప‌లువురు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగినా.. ఈ విష‌యంలో ఎవ‌రూ కూడా ఒక నిర్ణ‌యానికి రాలేక పోయారు. తాజాగా చంద్ర‌బాబు.. పీలా శ్రీనివాస్ పేరును ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ఆయన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీ క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆమ‌ర‌ణ దీక్ష‌కు కూర్చున్న విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అర్ధ‌రాత్రి వేళ‌.. ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేసింది. దీంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు సానుభూతి పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. చంద్ర‌బాబు పీల శ్రీనివాస్ పేరును కార్పొరేష‌న్ మేయ‌ర్ పీఠానికి సిఫార్సు చేయ‌డం గ‌మ‌నార్హం.