బెంగాల్లో హై ఓల్డేజ్ టెన్షన్ మొదలైందా ?

అవును పశ్చిమబెంగాల్లో అసలైన టెన్షన్ ఇపుడే మొదలైంది. శుక్రవారం మమతాబెనర్జీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను చూడగానే చాలామంది షాక్ కు గురయ్యారు. ఇందుకు కారణం ఏమిటంటే తొందరలో జరగబోయే ఎన్నికల్లో మమత నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండటమే. నందిగ్రామ్ నియోజకవర్గమంటే అలాంటిలాంటి నియోజకవర్గం కాదు. అందుకనే ఏక కాలంలో ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది.

సంవత్సరాల తరబడి మమత భవానీపూర్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్నారు. ఆమెకు ఈ నియోజకవర్గంలో తిరుగులేదు. అయితే తాజాగా భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ లో పోటీ చేయాలన్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే మొన్నటివరకు మమతకు కుడిభుజంగా ఉన్న పార్లమెంటు సభ్యుడు సుబేందు అధికారిది నిందిగ్రామే. సుబేందు కుటుంబానికి సుమారు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుంది.

సుబేందు కుటుంబాన్ని కాదని ప్రత్యర్ధులు గెలవటం దాదాపు కష్టమే. దశాబ్దాల పాటు వీళ్ళ కుటుంబానిదే పై ప్రాంతంలో ఆధిపత్యం. ఇంతకాలం మమతకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు కుటుంబం సీఎంతో విభేదించి బీజేపీలో చేరారు. వీళ్ళ కుటుంబానికి నందిగ్రామ్ చాలా కీలకం. కాబట్టి కొడితే కుంభస్ధలాన్నే కొట్టాలన్న ప్లాన్ తోనే మమత నందిగ్రామ్ లో పోటీ చేయటానికి డిసైడ్ అయ్యారు.

మమత వ్యూహం ఏమిటంటే నందిగ్రామ్ లో గనుక తాను పోటీ చేస్తే సుబేందు కుటుంబం మొత్తం దృష్టినంతా నందిగ్రామ్ లోనే కేంద్రీకృతం చేస్తుంది. దీంతో మిగిలిన నియోజకవర్గాలపై వాళ్ళ దృష్టి తగ్గుతుంది. వాళ్ళని నందిగ్రామ్ కు పరిమితం చేయటం, తాను గెలిచి సుబేందు కుటుంబం ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడమే వ్యూహంతో మమత పావులు కదుపుతున్నారు. అభ్యర్ధుల జాబితా విడుదల కాగానే బెంగాల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.

నందిగ్రామ్ లో మమత పోటీ ఖాయమైపోయింది కాబట్టి బీజేపీ తరపున లేదా సుబేందు కుటుంబం తరపున ఎవరు పోటీ చేస్తారో చూడాలి. భవానీపుర్ నుండి మమత ప్లేసులో సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. మొదటి జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలున్నారు. మొత్తానికి ఎన్నికల్లో హై ఓల్టేజీ ప్రారంభమైనట్లే.