జాతీయ కమిటిలో చంద్రబాబు

మొత్తానికి చంద్రబాబునాయుడు విషయంలో కేంద్రప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందిచినట్లే అనిపిస్తోంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో ఎలా నిర్వహించాలనే విషయంలో సలహాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం జాతీయస్ధాయిలో ఓ కమిటిని నియమిచింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులున్నారు. ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, గవర్నర్లు, జాతీయ పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నేతలు కూడా ఉన్నారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఉన్న ఈ కమిటిలో తెలుగు వాళ్ళకు కూడా సముచిత స్ధానమే దక్కింది. ముఖ్యమంత్రుల హోదాలో కేసీయార్, జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఉన్నారు. చంద్రబాబుతో పాటు బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, మీడియా అధిపతి రామోజీరావు, భారత్ బయోటెక్ అధినేత కృఫ్ణాఎల్లా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మిథాలీరాజ్ తదితరులున్నారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే మనదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించటం ఏమిటో అర్ధం కావటంలేదు. జాతీయస్ధాయిలో నిర్వహించారంటే అర్ధముంది. కానీ అంతర్జాతీయ స్ధాయిలో ఎలా నిర్వహిస్తారు ? ఒక దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇతర దేశాల్లో ఘనంగా నిర్వహించటం ఏమిటో జనాలకు అర్ధం కావటంలేదు. ఎందుకంటే విదేశాల స్వాతంత్ర్య దినోత్సవాలను మనదేశంలో జరిపిన దాఖలాలు లేవు. ఢిల్లీలోని వివిధ దేశాల రాయబార కార్యాలయాల్లో మాత్రమే సదరు దేశాల స్వాతంత్రవ్య దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.

కేంద్రప్రభుత్వం 259 మందితో తాజాగా నియమించిన ఉన్నతస్ధాయి కమిటికి ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి మళ్ళీ మోడికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఇపుడు కేంద్రమే తనంతట తానుగా ఉన్నతస్ధాయి కమిటిలో చంద్రబాబుకు అవకాశం ఇవ్వటం గమనార్హం. మరి ఇంతమందికి చోటు కల్పించిన కేంద్రం సెలబ్రిటి+జనసేన అధినేత+మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ కు ఎందుకు చోటు కల్పించలేదో.