ఏపీపై కన్నేసిన ఓవైసీ.. తొలిసారి బెజవాడలో ఎంట్రీ

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లిస్.. గడిచిన కొన్నేళ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది. గురి చూసి కొట్టినట్లుగా.. అత్యంత వ్యూహాత్మకంగా.. పరిమిత స్థానాల్లోనే బరిలోకి దిగే ఈ పార్టీ తొలిసారి ఏపీలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లో MIM పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. అయితే.. ఏపీలోని మిగిలిన ప్రాంతాల్ని అస్సలు టచ్ చేయని ఈ పార్టీ.. విజయవాడను మాత్రమే టార్గెట్ చేసింది.

అందులోనూ బెజవాడలోని రెండు డివిజన్లలో మాత్రమే తన అభ్యర్థుల్ని బరిలోకి దించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని రెండు స్థానాల్లో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి తరఫున ఎన్నికల ప్రచారాన్నిమజ్లిస్ ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన సీఏఏ.. ఎన్ ఆర్సీసీకి వ్యతిరేకంగా గత ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన మీటింగ్ లో మజ్లిస్ అధినేత అసద్ హాజరయ్యారు.

ఆ సందర్భంగా మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఏఏను వ్యతిరేకించాలని అప్పట్లో ఏపీ ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ సభలో టీడీపీ నేత కేశినేని నాని.. ఓవైసీలు ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. తొలిసారి బరిలోకి దిగుతున్న మజ్లిస్ అభ్యర్థుల తరఫున హైదరాబాద్ లోని నాంపల్లి ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉన్న రెండు స్థానాల్ని మజ్లిస్ ఎంపిక చేసుకుంది. ఇక్కడ గెలుపు జెండాను ఎగురవేస్తే.. ఏపీలో ముస్లింలు అధికంగా ఉండే చోట మజ్లిస్ గురి పెట్టనుందని చెబుతున్నారు.