కాలేజీ వేడుక‌లో నాగ్ అశ్విన్‌ను మెప్పించి…

ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షిస్తున్న కొత్త అందం. జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోందీ లోక‌ల్ బ్యూటీ. చిట్టి నీ న‌వ్వంటే అంటూ న‌వీన్ పొలిశెట్టి మైమ‌రిచిపోయి పాడేస్తుంటే.. ఈ అమ్మాయి అందం చూసి కుర్రాళ్లు కూడా అదే భావ‌న‌లోకి వెళ్లిపోయారు. రెగ్యుల‌ర్ హీరోయిన్ల‌కు భిన్న‌మైన అందం, హావ‌భావాల‌తో ఈ అమ్మాయి ప్రేక్ష‌కుల‌ను దృష్టిని ఆక‌ర్షించింది.

ఆరేళ్లకు పైగా థియేట‌ర్ ఫీల్డ్‌లో అనుభ‌వం సాధించి మ‌రీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందీ అమ్మాయి. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో పుట్టి పెరిగిన త‌న‌కు సినిమా అవ‌కాశం అనుకోకుండా వ‌చ్చింద‌ని ఆమె వెల్ల‌డించింది. జాతిర‌త్నాలు నిర్మాత అయిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఓ కాలేజీ వేడుక‌లో త‌న‌ను చూసి ఈ సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు ఆమె తెలిపింది.

తాను హైద‌రాబాద్ ల‌యోలా కాలేజీలో చ‌దువుకున్నాన‌ని.. ఆ కాలేజీ పూర్వ విద్యార్థుల స‌మావేశానికి వెళ్లిన‌పుడు ముఖ్య అతిథిగా వ‌చ్చిన‌ నాగ్ అశ్విన్‌కు క‌లిసి త‌న‌కున్న సినిమా ఆస‌క్తి గురించి చెప్పాన‌ని.. ఆ త‌ర్వాత కొంత కాలానికి ఆయ‌న పిలిచి ఆడిష‌న్ చేసి జాతిర‌త్నాలు సినిమాకు క‌థానాయిక‌గా ఎంపిక చేశార‌ని ఫారియా వెల్ల‌డించింది. జాతిర‌త్నాలులో త‌న పాత్ర ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో న‌చ్చుతుంద‌ని, త‌న‌కీ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేసింది.

ఈ సినిమా త‌ర్వాత‌ ఎవ‌రితో న‌టించాల‌ని ఆశిస్తున్నారు అని అడిగితే.. మ‌ల‌యాళ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్‌కు తాను వీరాభిమానిని అని.. ఆయ‌న‌తో న‌టించాల‌ని ఉంద‌ని చెప్పిన ఫారియా.. తెలుగులో మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రొమాన్స్ చేయాల‌న్న‌ది త‌న కోరిక అని వెల్ల‌డించింది. జాతిర‌త్నాలు ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.