కియా ప్రధాన గేటు వద్ద దారుణ రోడ్డు ప్రమాదం

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నిర్లక్ష్యం.. అమితమైన వేగం.. వీటికి తోడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం. పెద్ద ఎత్తున ప్రాణాలు తీస్తున్నప్పటికి మద్యం తాగి వాహనాన్ని నడపకూడదన్న బుద్ధి మాత్రం రావట్లేదు. తాజాగా అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జుకావటమే కాదు.. ఒక టైరుపూర్తిగా బయటకు వచ్చేసి.. ప్రమాదానికి దూరంగా పడి ఉండటం చూస్తే.. ప్రమాద తీవ్రత ఎంతన్నది అర్థమవుతుంది.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి సమీపంలోని కియా కార్ల పరిశ్రమ ప్రధాన గేటు వద్ద జరిగిన ఈ దుర్ఘటన లో నలుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రమాదానికి గురైన కారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఢిల్లీకి చెందిన ఒక యువతి.. బెంగళూరుకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నట్లుగా తేలింది. ప్రమాదస్థలిలో లభించిన ఆధార్ కార్డులతో ఈ సమాచారం బయటకు వచ్చింది.

డ్రైవింగ్ చేసిన వ్యక్తి చేతిలో బీరు బాటిల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవ్ చేస్తున్న యువకుడు ఒకచేత్తో బీర్ బాటిల్.. మరో చేత్తో స్టీరింగ్ పట్టుకొని ఉన్నట్లు అర్థమవుతుంది. అసలీ ప్రమాదం మొత్తం కారునడిపిన యువకుడి నిర్లక్ష్యమేనని చెప్పాలి. ఎందుకంటే.. ముందు ఉన్న గుర్తు తెలియని వాహనం వేగం తగ్గటం.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనటంతోఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఒకరి నిర్లక్ష్యం.. ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందో ఈ ప్రమాదాన్ని చూస్తే అర్థం కాక మానదు.