హిందీ హీరోకు రకుల్ తెలుగు షాక్

ఇంతకుముందులా పరభాషా కథానాయికలు ఏదో వచ్చామా తెలుగులో సినిమా చేసి వెళ్లిపోయామా అన్నట్లు ఉండట్లేదు. మన భాష నేర్చేసుకుంటున్నారు. ఒకప్పటి హీరోయిన్లు ఎన్నేళ్లు తెలుగులో నటించినా ‘‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’’ అంటూ వచ్చీ రాని తెలుగులో ఒకట్రెండు మాటలు మాట్లాడితే ఎక్కువ అన్నట్లుండేది. కానీ ఇప్పటి హీరోయిన్లు ఒకట్రెండు సినిమాలకే మన భాష మీద పట్టు సాధిస్తున్నారు.

సమంత, తమన్నా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్, పూజా హెగ్డే, రష్మిక మందన్నా.. ఇలా చాలామంది పరభాషా కథానాయికలు తెలుగులో గలగలా మాట్లాడేసేవాళ్లే. వీరిలో సమంత, రష్మిక లాంటి వాళ్లు సౌత్ అమ్మాయిలు కాబట్టి తెలుగులో పట్టు సాధించడం సులువే అనుకోవచ్చు. కానీ ఢిల్లీ అమ్మాయి అయిన రకుల్ ప్రీత్ తెలుగులో ఎంతో స్పష్టంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె మన వాళ్లనే కాదు.. బాలీవుడ్ వాళ్లకు సైతం తన తెలుగుతో షాకిస్తోందట.

తన వెంట ఉండే టీమ్ అంత తెలుగు వాళ్లే అని.. కాబట్టి ఎక్కడికి వెళ్లినా తాను తెలుగులో మాట్లాడక తప్పదని రకుల్ చెప్పింది. తన కొత్త చిత్రం ‘చెక్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి రకుల్.. తన తెలుగు నైపుణ్యం గురించి మాట్లాడింది. ముంబయిలో సైతం తాను తెలుగులోనే మాట్లాడతానని వెల్లడించింది. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నా సహాయకులు తెలుగు వాళ్లే. నేనెక్కడికి వెళ్లినా వాళ్లు నా తోడుగా ఉంటారు కాబట్టి తెలుగులో మాట్లాడక తప్పదు. ఈ మధ్య తాను హిందీలో చేస్తున్న ‘సర్దార్ కా గ్రాండ్ సన్’కు సంబంధించి ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తెలుగువాడే అయిన ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్‌తో తెలుగులో మాట్లాడ్డం చూసి హీరో అర్జున్ కపూర్ ఆశ్చర్యపోయాడు. నా పేరులో ప్రీత్ సింగ్ అని లేకపోయి ఉంటే కచ్చితంగా అందరూ తెలుగమ్మాయే అనుకునేవారని అన్నాడు’’ అని రకుల్ వెల్లడించింది.

మరో లాక్ డౌన్ టైం తన జిమ్ వ్యాపారం దెబ్బ తిందని, అయినా సరే సిబ్బందికి జీతాలు ఆపలేదని, ఇప్పుడిప్పుడూ మళ్లీ బిజినెస్ ఊపందుకుంటోందని రకుల్ తెలిపింది.