అవును.. జగన్ మడమ తిప్పారు.. సాక్ష్యాలివే

మాట అంటే మాటే. మా కుటుంబానికి మాట ఇవ్వటమే కానీ తప్పే అలవాటు అస్సలు లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ తమ గురించి గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంటుంది. మరి.. మాటల్లో ఉండే పస చేతల్లో ఉందా? అంటే లేదనే చెప్పాలి. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. ఈ వాదన నిజం అనిపించక మానదు.

ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుల్ని ఎంపిక చేసుకునే విషయంపై ఇప్పటివరకు పలువురు ఆశావాహులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. గతంలో అధినేత తమకు ఇచ్చిన హామీలకు తగ్గట్లే పదవుల పంపకం ఉంటుందని భావించారు. చివరకు.. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను చూసి కంగు తినటమే కాదు.. మడమ తిప్పనని చెప్పే అధినేత ఇంత అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అధికారంలో లేని వేళ.. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వటం ఏమిటన్న ప్రశ్న పలువురి నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గతంలో జగన్ ఇచ్చిన హామీల్ని గుర్తు చేసుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. స్వర్ణకార కుటుంబానికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని బహిరంగంగా మాట ఇచ్చారు. కానీ.. అదేమీ ఇప్పటివరకు జరగలేదు.

గుంటూరు పట్టణానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పలుమార్లు చెప్పినా.. ఆయన్ను కాదని చివర్లో ఏసురత్నాన్ని బరిలోకి దించారు. దీంతో.. అప్పిరెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా బుజ్జగించారు. ఎమ్మెల్సీ ఆశ చూపించారు. చివరకు అది కూడా కాకపోవటంతో వారు తీవ్ర ఆగ్రహంతో వున్నారు.

ఇదే జిల్లాకు సంబంధించి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ పోటీ చేస్తారని వైఎస్ జగన్ కూడా చెప్పారు. కానీ.. టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనీకి టికెట్ ఇవ్వటం.. ఆమె గెలుపొందటం జరిగిపోయాయి. దీంతో.. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పినా అది ఇప్పటివరకు వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఆయన పేరు ఉంటుందని భావిస్తే అది కూడా జరగకపోవటంతో ఆయన వర్గీయులు కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదే విధంగా పలువురు నేతల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. పదవుల ఆశ చూపించి పార్టీ కోసం పని చేయించుకున్నారని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లకు దగ్గరకు వస్తున్నా ఇప్పటివరకు పదవులు దక్కలేదని వాపోతున్నారు. మాట ఇస్తే అంతే.. జరిగిపోతుందని బలంగా చెప్పే అధినేత తీరుకు వాస్తవాలుఉంటున్నాయని వాపోతున్నారు. అదేంది జగనన్నా.. ఇలా మడమ తిప్పేశారేంటి? అంటూ వేస్తున్నప్రశ్నలు అధికారపక్షానికి ఇబ్బందిగా మారుతోంది.