వర్మ నిర్మాత.. జేడీ దర్శకత్వం


నటుడిగా ఒకప్పుడు పెద్ద పెద్ద విజయాలే అందుకున్నాడు జేడీ చక్రవర్తి. ముఖ్యంగా 90ల్లో ‘గులాబి’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సత్య’ లాంటి చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరోగా కొంచెం డౌన్ అవుతున్న సమయంలో అతను దర్శకత్వం వైపు అడుగులేశాడు. హిందీలో దర్వాజా బంద్ రఖో.. తెలుగులో హోమం, సిద్ధం లాంటి సినిమాలు తీశాడు. ఐతే ఒక దశ దాటాక అందులోనూ పట్టు కోల్పోవడంతో జేడీ కొన్నేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో అనుకృతి శర్మ అనే అమ్మాయిని పెళ్లాడటం ద్వారా వార్తల్లో నిలిచిన జేడీ.. తర్వాత కనిపించకుండా పోయాడు.

ఇప్పుడతను ‘ఎంఎంఓఎఫ్’ పేరుతో ఓ సినిమా చేశాడు. ఎన్.ఎస్.సి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాను కలిసిన జేడీ.. త్వరలో తన గురువు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తాను దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్నట్లు వెల్లడించాడు.

తన మిత్రుడైన కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ సినిమాను నిర్మించిన వేణుగోపాల్‌తో కలిసి రామ్ గోపాల్ వర్మ తీయబోయే చిత్రానికి తాను దర్శకత్వం వహించనున్నానని, త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని జేడీ చెప్పాడు. అలాగే తన స్వీయ నిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు జేడీ తెలిపాడు. వర్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తనకు ఒక దారి చూపించిన గురువుగా ఆయన్ని భావిస్తానని చెప్పిన జేడీ.. తన మాటలు ఆర్జీవీ తరహాలో ఉంటాయి కానీ తమ ఇద్దరి జీవితాలు పూర్తి భిన్నమన్నాడు.

కుటుంబ బంధాల మీద విషయంలో తాను చాలా ఎమోషనల్ అని, వర్మ అలాంటి వాటికి దూరంగా ఉంటాడని.. సాయంత్రం 7 గంటలైతే వర్మ ఆఫీసు పార్టీలతో కళకళలాడిపోతుందని.. తాను మాత్రం 7 తర్వాత ఎవ్వరినీ కలవనని జేడీ చెప్పాడు. ఇక ‘ఎంఎంఓఎఫ్’ సినిమా గురించి చెబుతూ.. ఇందులో మల్టీప్లెక్సుల హవా నడుస్తున్న సమయంలో సింగిల్ థియేటర్లో పాత చిత్రాలు, బిట్ సినిమాలు నడుపుకునే వ్యక్తిగా తాను కనిపిస్తానని, ఆ థియేటర్లో అనుకోకుండా హత్యలు జరిగితే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిందన్నదే ఈ సినిమా అని జేడీ వెల్లడించాడు.