ఘట్‌కేసర్: కిడ్నాప్ డ్రామా ఆడి చివరికి ఆత్మహత్య

సంచలనం రేపిన ఘట్‌కేసర్ విద్యార్థిని వ్యవహారం చివరికి విషాదాంతం అయింది. తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి పాల్పడ్డారని రెండు వారాల కిందట ఘట్‌కేసర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆరోపించడం, చివరికి ఆమె చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తదనంతర పరిణామాలతో తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోమ‌వారం రాత్రి నిద్ర మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ‌దీంతో మృతురాలి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

సదరు విద్యార్థిని బీ ఫార్మ‌సీ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఫిబ్ర‌వ‌రి 10న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తాను కిడ్నాప్‌కు గురయ్యాయ‌నని, నలుగురు ఆటోడ్రైవర్లు తనపై అత్యాచారం చేశార‌ని ఆమె త‌ల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లి 100కు డ‌య‌ల్ చేయ‌డంతో పోలీసులు యువతి మొబైల్‌ను ట్రాక్ చేసి తన వద్దకు చేరుకున్నారు. యువతి చెప్పిన మాటల్ని బట్టి కొందరు ఆటోడ్రైవర్లను పిలిపించి విచారించారు. తనపై అత్యాచారం చేసినట్లుగా ఓ వ్యక్తిని చూపించడంతో అతడితో పాటు మరికొందరు ఆటోడ్రైవర్లను పోలీసులు తమదైన శైలిలో విచారించారు.

ఐతే తదుపరి విచారణలో భాగంగా యువతి మాటలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీ‌టీవీ ఫుటే‌జీ‌లను పరి‌శీ‌లించి, అన్ని విషయాలూ నిర్ధారించుకున్న తర్వాత ఆ యువతిపై అత్యాచారమే జరగలేదని, కిడ్నాప్ డ్రామా ఒట్టిదేనని తేలింది. తాను కిడ్నాప్‌కు గురైన సమయంలో యువతి.. ఓ అబ్బాయితో కలిసి తిరిగినట్లు తేలింది.

ఇదిలా ఉంటే అకారణంగా తమను చిత్రహింసలు పెట్టడంతో ఆటోడ్రైవర్లు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద అభాండాలు వేసిన మీడియా మీద కూడా ధ్వజమెత్తారు. వాళ్లు తిరిగి సదరు యువతిపై కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో యువతిని అందరూ నిందించిన నేపథ్యంలో ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.