కోర్టులో వాదించబోతున్న రవితేజ

చడీచప్పుడు లేకుండా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు మాస్ రాజా రవితేజ. సంక్రాంతికి ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అతను.. ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాకముందే దాని తర్వాత చేయబోయే సినిమాను ప్రకటించాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే లాంటి హిట్ చిత్రాలు అందించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ రాజా నటించబోతున్నాడు.

ఈ కాంబినేషన్ గురించి ఎప్పట్నుంచో వార్తలొస్తున్నా ఇప్పటికి అది కార్యరూపం దాల్చింది. త్రినాథరావు ఆస్థాన రచయిత అనదగ్గ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఐతే ఇంతకుముందు త్రినాథరావు-ప్రసన్నకుమార్ కలయికలో వచ్చిన మూడు సినిమాల కథలు ఒకే రకంగా ఉంటాయి. హీరో.. హీరోయిన్.. హీరోయిన్ తండ్రి.. ఈ ముగ్గురి మధ్య నడిచే కథలవి. హీరోకు, అతడి మామకు మధ్య నువ్వా నేనా అన్నట్లు ఆ కథలు నడుస్తాయి.

ఐతే ఈ తరహా కథలు యువ కథానాయకులకు బాగానే ఉంటాయి. రవితేజ ఈ వయసులో ఆ టైపు పాత్రలు చేయలేడు. పైగా త్రినాథరావు-ప్రసన్నకుమార్ కలయికలో మరోసారి అలాంటి కథ వస్తే జనాలకు మొహం మొత్తేస్తుంది కూడా. ఈ నేపథ్యంలో మాస్ రాజా కోసం ఎలాంటి కథ రెడీ చేశారా అన్న ఆసక్తి అందరిలోనూ పుట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రవితేజ ఈ చిత్రంలో లాయర్ పాత్ర చేయనున్నాడట. అది ఫుల్ లెంగ్త్ కామెడీ స్టయిల్లో ఉంటుందట.

ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు కూడా చెబుతున్నారు. హీరోయిన్ పాత్ర కూడా లాయరే అని సమాచారం. రవితేజ మార్కు అల్లరి చేయడానికి ఈ సినిమాలో మంచి ఛాన్సే ఉందట. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రినాథరావు, ప్రసన్న కుమార్.. రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోతో సినిమా చేయబోతుండటంతో కచ్చితంగా ఇది మాంచి ఎంటర్టైనింగ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.