తేజ నుంచి ‘చిత్రం’ సీక్వెల్

సంచలన దర్శకుడు తేజ నుంచి ఒక ఆశ్చర్యకర అనౌన్స్‌మెంట్ వచ్చింది. తన అరంగేట్ర సినిమా ‘చిత్రం’ కు సీక్వెల్ ప్రకటించారాయన. దీనికి ‘చిత్రం 1.1’ అని పేరు కూడా పెట్టాడు తేజ. ‘చిత్రం’ సినిమాకు తన సంగీతంతో ఎంతో బలంగా నిలిచిన, ఒకప్పటి తన ఆస్థాన సంగీత దర్శకుడైన ఆర్.పి.పట్నాయక్‌‌ను ‘చిత్రం 1.1’ కోసం తేజ ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చనుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోస్టర్ మీద బేనర్ ఏదీ కనిపించలేదు. బహుశా తేజనే ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముంది.

ఈ పోస్టర్ మీద పిక్టోగ్రామ్స్‌ను బట్టి చూస్తే హీరో హీరోయిన్లు స్పోర్ట్స్ పర్సన్స్ అనిపిస్తోంది. హాకీ, జిమ్నాస్టిక్స్ ఆటలకు సంబంధించిన పిక్టోగ్రామ్స్ కనిపిస్తున్నాయక్కడ. అలాగే ఓ గుర్రం, బెలూన్లు ఎగరేస్తున్న ఓ అమ్మాయి, ఏ ఏనుగు, దాని పిల్ల.. ఒక కోడి పిక్టోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కథతో సంబంధం ఉండి ఉండొచ్చు.

‘చిత్రం’ సినిమా రెండు దశాబ్దాల కిందట రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటికి తెలుగు సినిమా ఒక మూసలో సాగిపోతుండగా.. కొత్త హీరో హీరోయిన్లను పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ఒక యూత్ ఫుల్ కథతో తేజ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనూహ్య విజయం సాధించింది. అలాగే తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచింది. ఈ కోవలో ఆ తర్వాత ఎన్నో యూత్ ఫుల్ సినిమాలు వచ్చాయి. ఈ చిత్రంతో పరిచయమైన ఉదయ్ కిరణ్, రీమాసేన్ టాలీవుడ్లో బిజీ హీరో హీరోయిన్లయిపోయారు. దర్శకుడిగా తేజ దశ తిరిగిపోయింది. సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ కెరీర్ కూడా మారిపోయింది.

ఆ తర్వాత తేజ ‘నువ్వు నేను’, ‘జయం’ లాంటి మరో రెండు యూత్ ఫుల్ బ్లాక్‌బస్టర్లు తీసి తనపై అంచనాల్ని పెంచేశాడు కానీ.. ఆపై ఇదే టైపు చిత్రాలనే మార్చి మార్చి తీసి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. కొన్నేళ్ల కిందట ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ ఓ హిట్ కొట్టిన తేజ.. ‘సీత’తో మళ్లీ గాడి తప్పాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘చిత్రం’ సీక్వెల్ ప్రకటించాడు. ‘ఔనన్నా కాదన్నా’ తర్వాత ఆర్పీతో తేజ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. బహుశా ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తారని భావిస్తున్నారు.