ఏడ్చేసిన అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చినట్లుంది. గత కొన్నేళ్లలో అతడి ఏ సినిమాకూ రాని స్పందన కొత్త చిత్రం ‘నాంది’కి వస్తోంది. ఒక దశలో టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోగా ఉన్న నరేష్.. గత ఎనిమిదేళ్లలో ఫ్లాపుల మీద ఫ్లాపులతో అల్లాడిపోయాడు. నరేష్ సినిమాలంటేనే ప్రేక్షకులు బెంబేలెత్తిపోయి థియేటర్ల వైపు రాని పరిస్థితి కనిపిస్తోంది కొన్నేళ్ల నుంచి. గత నెలలో విడుదలైన ‘బంగారు బుల్లోడు’ విషయంలోనూ అదే జరిగింది.

ఐతే తన కామెడీ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా సీరియస్ కథతో నరేష్ చేసిన ‘నాంది’ మాత్రం ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరుగా జరిగాయి. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు. టాక్ కూడా నాట్ బ్యాడ్ అనిపిస్తోంది. శుక్రవారం రిలీజైన మూడు చిత్రాల్లో మెరుగైంది ‘నాంది’నే. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమాను సరిగా ప్రమోట్ చేసుకుంటే లాభాల బాట పట్టే అవకాశముంది.

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఆలస్యం చేయకుండా చిన్న స్థాయిలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన నరేష్.. ఒక దశలో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టేసుకోవడం విశేషం. సినిమాలో తన తండ్రి పాత్ర చేసిన దేవీ ప్రసాద్‌ను పట్టుకుని అతను ఉద్వేగంతో ఏడ్చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. 2012లో వచ్చిన సుడిగాడు తన చివరి పెద్ద హిట్ మూవీ అని, ఆ తర్వాత తనకు అంతటి విజయం ‘నాంది’నే అని చెప్పాడు.

ఎనిమిదేళ్లు తనకు హిట్ లేకపోయినా.. తన దగ్గరికి వచ్చి ఇమేజ్‌కు భిన్నంగా ఓ సీరియస్ సినిమా చేద్దామని చెప్పడానికి చాలా ధైర్యం కావాలని.. ఆ ధైర్యం, ప్రోత్సాహం నిర్మాత సతీశ్ వేగేశ్న ఇచ్చారని.. తన రెండో ఇన్నింగ్స్‌కు విజయ్ కనకమేడల ‘నాంది’ పలికాడని ఉద్వేగంతో చెప్పాడు. శుక్రవారం ఉదయం నుంచి తనకు వరుసగా ఫోన్లు వస్తున్నాయని, ఇకపై ఇలాంటి మంచి సినిమాలే చేయమని అందరూ ప్రోత్సహిస్తున్నారని నరేష్ అన్నాడు.