మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయిన ఆ సినిమా

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భార‌తావ‌నికి ప‌త‌కాల ప‌ట్టిక‌లో చోటు క‌ల్పించి దేశం ప‌రువు నిలిపిన దిగ్గ‌జ క్రీడాకారిణి క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి. ఆ ఒలింపిక్స్‌లో అసాధార‌ణ ప‌ట్టుద‌ల‌తో పోరాడిన ఆమె.. కాంస్య ప‌త‌కం గెలిచింది. ఈ ఉక్కు మ‌హిళది తెలుగు గ‌డ్డే అన్న సంగ‌తి తెలిసిందే. శ్రీకాకుళంకు చెందిన ఈ లెజెండ‌రీ వెయిట్ లిఫ్ట‌ర్ జీవిత క‌థ‌తో ఓ సినిమా తీయ‌బోతున్న‌ట్లు గ‌త ఏడాది ఘ‌నంగా ప్ర‌క‌ట‌న చేశారు.

వైజాగ్ ఎంపీ, నిర్మాత అయిన ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి రైట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. సంజ‌నా రెడ్డి అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలిని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్ర‌క‌ట‌న అయితే ఘ‌నంగా చేశారు కానీ.. ఇప్ప‌టిదాకా ఆ సినిమా గురించి మ‌రో అప్‌డేట్ లేదు.

ఐతే ఎట్ట‌కేల‌కు మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ గురించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ సినిమా మొద‌ల‌వ‌కుండానే ఆగిపోయింది అన్న‌దే ఆ అప్‌డేట్. స‌రిగ్గా కార‌ణాలేంట‌న్న‌ది బ‌య‌టికి రాలేదు కానీ.. ఈ చిత్రం ముందుకు క‌దిలే అవ‌కాశాలు లేవ‌న్న‌ది తాజా స‌మాచారం. మ‌ల్లీశ్వ‌రి పాత్ర కోసం కొంద‌రు హీరోయిన్ల‌ను అడిగి లేద‌నిపించుకుని చివ‌రికి రకుల్ ప్రీత్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌కు ఆమె ఏమాత్రం సూట‌వుతుంద‌న్న‌ది సందేహ‌మే.

కాగా పాన్ ఇండియా లెవెల్లో చేయాల‌నుకున్న ఈ చిత్రానికి భారీ బ‌డ్జెట్టే అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ అందుకు త‌గ్గ‌ట్లు ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీని మార్కెట్ చేయ‌డం తేలిక కాదు. ఈ త‌రం స్పోర్ట్స్ స్టార్లయిన సైనా, సింధుల‌ బ‌యోపిక్‌లే ముందుకు క‌ద‌ల‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా తెలియ‌ని మ‌ల్లీశ్వ‌రి క‌థ‌తో సినిమా తీస్తే వ‌ర్క‌వుట్ అవుతుందో కాదో అన్న సందేహాల మ‌ధ్య ఈ సినిమాకు బ్రేక్ ప‌డిన‌ట్లుగా చెప్పుకుంటున్నారు.