జగన్ ఏం చెబితే అది చేస్తా.. : బాబు సంచలనం

తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో హీట్ పెంచుతున్న విశాఖ ఉక్కు ఉదంతంలో ఇప్పటివరకు జరిగిన వాటికి భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టటం.. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించటం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పల్లాను పరామర్శించారు.

ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామా చేస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా.. తాము కూడా రాజీనామాలు చేస్తామన్నారు. సీనియర్ నేత అన్న అహం తనకు లేదని.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవటం కోసం దేనికైనా రెఢీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ చెప్పింది చేస్తా. ప్రజలకు సహకరించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం. ప్రభుత్వంపైనే ఎక్కువ బాధ్యత ఉంది. ప్రతిపక్షంగా సహకరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే వరకు పోరాడతాం’’ అని బాబు వ్యాఖ్యానించారు.

విశాఖ ఉక్కుకర్మాగారం విషయంలో జగన్ ఏం చెబితే అది చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన బాబు.. అదే సమయంలో సీఎంపై తీవ్రంగా మండిపడ్డారు. స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెడితే.. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ‘ఎక్కడికి వెళ్లారు? తాడేపల్లిలో ఏం చేస్తున్నారు? పబ్ జీ ఆడుకుంటున్నారా? రాష్ట్ర హక్కుల్ని కాపాడలేక ప్రజల సెంటిమెంట్ ను అమ్ముకోవాలని చూసే వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత ఉందా?’’ అని నిప్పులు చెరిగారు. జగన్ కు సహకారం అందిస్తానని చెబుతూనే.. సీఎంపై భారీగా చురకలు వేసిన బాబు తీరు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.