నాగ్ ఈ గ్యాప్‌లో ఏం చేశాడంటే..

అక్కినేని నాగార్జున చివరగా ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించాడు. ఈ చిత్ర షూటింగ్ మూడు నెలల కిందటే పూర్తయింది. ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని మరీ వెళ్లి ఈ సినిమాను పూర్తి చేసి వచ్చాడు నాగ్. ఆ షెడ్యూల్‌తోనే సినిమా పూర్తయింది. తర్వాత మరి కొన్ని రోజులు ‘బిగ్ బాస్’లో బిజీగా ఉన్నాడు నాగ్. అది పూర్తయి కూడా రెండు నెలలు కావస్తోంది. ఇక అప్పట్నుంచి నాగ్ ఏం చేస్తున్నాడో ఎవరికీ క్లారిటీ లేదు.

ఈ రెండు నెలల్లో ఆయన కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదు. ఇంకే కార్యక్రమంలోనూ కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేడు. ‘వైల్డ్ డాగ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఏమైనా బిజీగా ఉన్నాడా అంటే అలాంటి సంకేతాలు కూడా కనిపించలేదు. ఆ సినిమా రిలీజ్ గురించి కూడా ఎక్కడా మాట్లాడట్లేదు. దీంతో అక్కినేని అభిమానులు కూడా నాగ్ ఏం చేస్తున్నాడో తెలియక అయోమయంలో పడిపోయారు.

నాగ్ నుంచి ఈ సైలెన్స్ ఏంటబ్బా అని అంతా అనుకుంటున్న సమయంలో.. ఒక అప్‌డేట్‌తో అభిమానులను పలకరించాడు నాగ్. ఆయన ‘బిగ్ బాస్’ ముగించాక గత రెండు నెలల్లో ఏం చేశాడో ఈ అప్‌డేట్‌తో అందరికీ తెలిసొచ్చింది. బాలీవుడ్లో నాగ్ ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ ప్రొడక్షన్లో అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగ్ అరగంటకు పైగా నిడివి ఉండే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాలో తాను చేస్తున్న పాత్ర గురించి నాగ్ ముందు నుంచి ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు. ఇంతకుముందు ఒక షెడ్యూల్లో భాగంగా యూరప్ వెళ్లి వచ్చాడు నాగ్. మళ్లీ ఇప్పుడు ముంబయిలో కొంత కాలంగా నడుస్తున్న షెడ్యూల్‌కు హాజరయ్యాడు.

ఏకధాటిగా చిత్రీకరణ జరిపి నాగ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ అంతా అవగొట్టేశారట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మాస్త్ర’లో తన పని పూర్తయిందని, అయాన్ ముఖర్జీ సృష్టించిన అద్భుత ప్రపంచంలోకి ప్రేక్షకులను ఎప్పుడెప్పుడు తీసుకెళ్తానా అని ఉత్కంఠగా ఉందని నాగ్ చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ‘బ్రహ్మాస్త్ర’ విడుదలయ్యే అవకాశాలున్నాయి.