ఎల్ జీ ప్రతినిధుల్ని అందరి ముందు కడిగేసిన జగన్?

సంచలనంగా మారిన విశాఖ ఎల్ జీ పాలిమర్స్ విషాద ఉదంతంలో పలు కుటుంబాల్లో తీర్చలేని గుండె కోతను మిగిల్చింది. వేకువజామున లీకైన రసాయన వాయువులతో పదకొండు మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే హుటాహుటిన వైజాగ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం జగన్.

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన వేళలో.. దీనికి కారణమైన కంపెనీ టాప్ లెవల్ ప్రతినిధుల్ని కలిసేందుకు ముఖ్యమంత్రి స్థాయి నేతలు అనుమతివ్వరు. అందుకు భిన్నంగా ఏపీ సీఎం జగన్ వారిని కలిశారు. అయితే.. విమర్శలకు తావివ్వకుండా ఆయన వ్యవహరించిన వైఖరి ఆయనకు మైనస్ గా కాక.. ప్లస్ గా మారింది.

తనను కలిసే ప్రయత్నం చేసిన ఎల్ జీ ప్రతినిదులకు అనుమతిచ్చిన సీఎం జగన్.. కేసీహెచ్ ఆసుపత్రిలో అధికారులు.. వైద్యుల సమక్షంలో వారిని నిలదీయటం.. వారి బాద్యతారాహిత్యాన్ని తీవ్రంగా ప్రశ్నించటం గమనార్హం. స్టెరీన్ గ్యాస్ లీక్ అయినప్పుడు సమీప గ్రామాల ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించిన ఆయన.. అలారం ఎందుకు మోగలేదని ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేస్తున్నామని స్పష్టం చేయటంతో పాటు.. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కంపెనీకి చెందిన ప్రతినిధుల్ని కలిసే ప్రయత్నం అస్సలు చేయరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు. అందుకు భిన్నంగా అందరి ముందే కడిగేయటం ద్వారా.. తనకున్న కమిట్ మెంట్ ను తేల్చి చెప్పటంతో పాటు.. తన దగ్గర ఎలాంటి రహస్యాలు.. మొహమాటాలు ఉండవన్న సంకేతాల్ని జగన్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అందరూ తప్పు చేశారనుకునే ఉదంతాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవటంలో సీఎం సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.