జగన్ – షర్మిల మధ్య దూరానికి కారణం ఆమె?

తిట్టే వాళ్లు తిడుతుంటారు. పొడిగే వారు పొడుగుతుంటారు. మొత్తంగా తెలుగు మీడియాలో తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ. సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఇవాల్టి రోజున ఏదైనా విషయాన్ని దమ్ముగా చెప్పే మీడియా సంస్థల్లో ఆంధ్రజ్యోతి అన్న పేరును ఆయన తెచ్చుకున్నారు. నిజానికి అదే ఆ మీడియా సంస్థ బలంగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఇదిలా ఉంటే.. మూడు.. నాలుగు వారాల క్రితం తమ మొదటిపేజీలోనూ.. నాలుగో పేజీలోనూ షర్మిల రాజకీయ పార్టీ గురించి సంచలన కథనాన్ని తన పేరుతో అచ్చేయించారు ఆర్కే.

ఈ కథనంలోని అంశాల కారణంగా కావొచ్చు.. మొదటిపేజీలోనిఅంశాల్ని.. మరింత వివరంగా నాలుగో పేజీలో అచ్చేసి.. సరికొత్త ప్రయోగానికి తెర తీశారు. తెలంగాణలో రాజన్న ముద్దుబిడ్డ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా వెల్లడించిన సంచలనంగా మారారు. అదే సమయంలో.. పలువురు ఆయన కథనాన్ని తిట్టిపోశారు. కలలు కంటూ కథనాలు అల్లటం ఆర్కేకు అలవాటుగా వ్యంగ్యాస్త్రాల్ని సంధించినోళ్లు ఉన్నారు. ఏమైనా.. రాజకీయాల్లో కల్పిత వంటకాలకు ఆర్కే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారంటూ నోరు పారేసుకున్నోళ్లు లేకపోలేదు.

కట్ చేస్తే.. షర్మిల స్వయంగా పార్టీ పెట్టే విషయాన్ని చూచాయగా చెప్పటమే కాదు. స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చేయటంతో.. అప్పటివరకు ఆర్కేను ఆడిపోసుకున్న వారంతా ఆకాశానికి ఎత్తేయటం షురూ చేశారు. ఏమైనా..తెలుగు నాట సంచలన కథనాలు ఆర్కేకు మాత్రమే సాధ్యమన్న మాట పలువురి నోట వినిపించింది. ఇదిలా ఉంటే.. షర్మిల పార్టీ పెట్టటానికి కారణం ఏమిటి? అన్నకు.. చెల్లెలుకు మధ్య గ్యాప్ పెరగటం వెనుక ఎవరున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాని పరిస్థితి. ఇలాంటివేళ.. ఆర్కే తన తాజా కాలమ్ లో విషయాన్ని వెల్లడించారు.
ఎలాంటి వ్యాఖ్యలు లేకుండా.. జగన్-షర్మిల మధ్య దూరానికి కారణం ఏమిటి? అందుకు కారణమైన వ్యక్తి ఎవరన్న విషయంపై ఆయన ఏం రాసుకున్నారన్నది చూస్తే..

‘‘తెలంగాణలో షర్మిల ప్రారంభించబోతున్న రాజకీయ పార్టీతో తమకేమీ సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్‌ చెప్పించడాన్ని షర్మిల తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తన మనోభావాలను, ముఖ్యంగా జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులతో పంచుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలకు జగన్‌ భార్య శ్రీమతి భారతీరెడ్డి కేంద్రబిందువు కావడం విశేషం! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోవడానికి భారతీరెడ్డే కారణమని షర్మిల భావిస్తున్నారు’’

‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌కు భార్య బంగారమై పోయిందనీ, చెల్లెలు భారంగా మారిందనీ షర్మిల తమ కుటుంబ శ్రేయోభిలాషుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడు, ముఖ్యంగా జగన్‌ రెడ్డి జైలులో ఉన్నప్పుడు పార్టీ భారాన్ని మోసిన తనను ఇప్పుడు దూరం పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్న షర్మిల, అందుకు భారతీరెడ్డే కారణమని భావిస్తున్నారు’’

‘‘తొమ్మిదేళ్లు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాను. అలాంటి నన్ను పార్టీలోనే లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర వెనుక భారతీరెడ్డి ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా నేనెక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానోనని భార్యనే జగన్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. ఇదంతా భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనని అందరికీ తెలుస్తోంది. అధికారంలో లేనప్పుడు పాదయాత్రలు చేసి పార్టీని కాపాడింది నేనైతే, అధికారంలోకి వచ్చాక, మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను కాదని భారతిని ముఖ్యమంత్రిని చేయడమా? ఇదెక్కడి న్యాయం?’’

‘‘పార్టీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన నేను తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ప్రయత్నిస్తానని ప్రకటించిన వెంటనే నా రాజకీయ నిర్ణయంతో తమ పార్టీకి సంబంధం లేదని సలహాదారులతో చెప్పించడం ఏమిటి? రాజన్న రాజ్యం ఆశయసాధన కోసం నేను చేస్తున్న ప్రయత్నం సరైనదేనని జగన్‌కు అనిపించకపోవడానికి కారణం ఏమిటి? ఆయనకు ఇప్పుడు తండ్రి ఆశయాలకన్నా, చెల్లెలి ప్రయోజనాలకన్నా తన పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న రహస్య అనుబంధం సొంత చెల్లి కంటే ఎక్కువైపోయింది. చెల్లిపై మమకారం కంటే కేసీఆర్‌తో ఉన్న స్నేహం, ఆయనతో ఉన్న ఆర్థిక సంబంధాలే ముఖ్యమైపోయాయి’’ అని షర్మిల తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా ఆర్కే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా బాంబులు ఇంకెన్ని పేలుస్తారో? మరి.. ఆర్కే మాటలకు షర్మిల ఎలా రియాక్టు అవుతారో చూడాలి.