కొత్త రికార్డు: జూబ్లీహిల్స్ లో రికార్డు ధరకు భూమి అమ్మకం

హైదరాబాద్ మహానగరంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు పలికిన ధరలకు భిన్నంగా సంపన్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఇంటి స్థలాన్ని రికార్డు ధరకు కొనుగోలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తాన్ని వెచ్చింది ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 1837 చదరపు గజాల కోసం ఏకంగా రూ.41.3 కోట్ల మొత్తాన్ని వెచ్చించిన వైనం ఇప్పుడు సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

ఈ ప్రాంతంలో ఒక ఇంటి స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ లావాదేవీ కోసం రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం చెల్లించిన స్టాంపు డ్యూటీ భారీగా ఉందంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం బయటకు వచ్చిన అనధికారిక సమాచరం ఏమంటే.. 1837 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం కోసం ప్రభుత్వానికి చెల్లించిన స్టాంపు డ్యూటీనే రూ.2.27 కోట్లుగా చెబుతున్నారు. దీనికి అదనంగా మరో రూ.20లక్షల మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు.

జనవరి 28న జరిగిన ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు కాస్త ఆలస్యంగా.. తాజాగా బయటకు వచ్చాయి. ఒక ఫార్మా కంపెనీ అధినేత ఈ భారీ మొత్తానికి స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాజా లావాదేవీ ప్రకారం జూబ్లీహిల్స్ లో గజం భూమి విలువ రూ.2.2లక్షలుగా తేలింది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గజం భూమి విలువ రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతోందని..

తాజా లావాదేవీతో కొత్త రికార్డు నమోదైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమీ అసాధారణం ఏమీ కాదన్న మాట వినిపిస్తున్నా.. కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత దూకుడుగా ఉందన్న విషయం తాజా లావాదేవీ స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. అధికారికంగానే ఇంత ఉంటే.. అనధికారికంగా మరికొంత ధర ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.