కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. ఎవ‌రిని క‌ల‌వ‌నున్నారు.. ఏం చేయ‌నున్నారు ?

జాతీయస్థాయి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హస్తినకు చేరుకున్నారు. దేశ రాజకీయాలపై మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించిన వేళ.. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు.

మే 20వ తేదీన (నేడు) ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో , జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ త‌న వ్యూహాల‌ను వివ‌రించే అవ‌కాశం ఉంది. మే 21న కూడా ఢిల్లీలోనే ఉండ‌నున్నారు.

మే 22వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

మే 26వ తేదీ ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. ఈ సంద‌ర్భంగా జాతీయ రాజ‌కీయాలు.. పొత్తుల విష‌యంపై కీల‌క‌మైన చ‌ర్చ‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

మే 27వ తేదీన బెంగుళూరు నుంచి సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం సీఎం కెసిఆర్ షిర్డీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.

మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు.