దిగొచ్చిన మోడీ… కొత్త సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చ‌కు ఓకే ఏకంగా 15 గంట‌లు

ఇప్ప‌టి వ‌రకు తాము ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు! అని ప‌ట్టుబ‌డుతూ.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని, దీనిపై ఎవ‌రికీ తాము స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మొండికేస్తూ.. వ‌చ్చిన కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని స‌ర్కారు దిగి వ‌చ్చింది. విప‌క్షాల దూకుడుతో ఎట్ట‌కేల‌కు సాగు చ‌ట్టాల‌పై చ‌ర్చించేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. పార్లమెంట్‌లో రైతు ఉద్యమం, సాగు చ‌ట్టాల‌పై ఏకంగా ఏక‌ధాటిగా 15 గంటల పాటు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

వాస్త‌వానికి పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు నుంచి ప్ర‌తిప‌క్షాలు సాగు చ‌ట్టాల విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర‌ప తి ప్ర‌సంగాన్ని సైతం 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌హిష్క‌రించాయి. అయినా.. కేంద్రం లైన్‌లోకి రాలేదు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి రైతులు త‌మ ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ‌ల్లో .. విప‌క్షాలు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభలనూ మంగళవారం స్తంభింపజేశాయి.

ప్రతిపక్ష ఎంపీల నిరసనల హోరు మధ్య మంగళవారం రాజ్యసభ మూడుసార్లు.. లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడి.. చివరికి బుధవారానికి వాయిదా పడ్డాయి. అయితే, బుధ‌వారం కూడా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌డంతో ఇక‌, ఎట్ట‌కేల‌కు ఈ అంశంపై చ‌ర్చిచేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింది. ఏక‌ధాటిగా.. 15 గంట‌ల పాటు చ‌ర్చించేందుకు అంగీక‌రించింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నారని, ఈ అంశంపై చర్చించాలని రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును వివిధ పార్టీల నేతలు దుయ్యబట్టారు. ఇక‌, ఈ ప‌రిస్థితిపై ఏమ‌నుకున్నారో.. ఏమో ప్ర‌ధాని, హోం శాఖ‌ల నుంచి అనుమ‌తి రాగానే.. స‌భ‌లో చ‌ర్చ‌కు అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. అయితే.. ఈ చ‌ర్చ‌లు ఎలా ముందుకు సాగుతాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌తోనే స‌రిపెడ‌తారా? రైతుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అనేది మాత్రం వేచి చూడాలి.