స్వతంత్ర భారతంలో పెట్రోలు ధర రికార్డు – 100 దాటింది

అనుకున్నదంతా అయ్యింది. ఆరేడేళ్ల క్రితం మోడీ ప్రధానమంత్రి కావటానికి ముందు లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూపాయి.. రెండు పెరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. ఇలాంటివేళ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆసక్తికరమైన పోస్టులు వచ్చేవి. అసలుసిసలు దేశభక్తుడైన మోడీ కానీ ప్రధానమంత్రి అయితే దేశ రూపురేఖలు మారిపోతాయని.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అంతేనా.. మోడీ పవర్లోకి వచ్చాక లీటరు పెట్రోల్ రూ.50కి.. డీజిల్ మరింత తక్కువకు వచ్చే సత్యకాలం దగ్గర్లోనే ఉందంటూ ఉదరగొట్టేశారు.

అలాంటి ఆశావాహుల అంచనాలకు తగ్గట్లే ఒకసారి కాదు.. రెండుసార్లు మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న మోడీ హయాంలోనే దేశంలోని ఒక ప్రాంతంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.100 దాటేసిన శుభదినంగా చెప్పాలి. ఆకాశమే హద్దుగా సాగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు నేపథ్యంలో అతి త్వరలోనే లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేస్తుందన్న అంచనాలు నిజమయ్యాయి.

ఈ రోజు ఢిల్లీలో సాధారణ పెట్రోల్ లీటరు ధర రూ.86.30 అయితే.. డీజిల్ ధర రూ.76.48గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.88.82 అయితే.. డీజిల్ రూ.81.71 అయ్యింది. జైపూర్ లో లీటరు పెట్రోల్ రూ.93.86 అయితే.. డీజిల్ లీటరు రూ.85.73గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటరు ధర రూ.89.77 కాగా.. డీజిల్ ధర రూ.83.46గా ఉంది. అమరావతిలో పెట్రోల్ లీటరు ధర రూ.92.54గా ఉంటే.. డీజిల్ ధర రూ.85.73గా ఉంది.

వ్యాట్ లో (దేశ వ్యాప్తంగా అన్ని వస్తువులకు జీఎస్టీ ఉంటే.. పెట్రోల్.. డీజిల్ లాంటి కొన్నింటికి మాత్రం వ్యాట్ రూపంలో పన్ను వేస్తున్నారు) ఉన్న తేడాల కారణంగా ఆయా రాష్ట్రాల ధరల్లో తేడా ఉంది. ఇదంతా పక్కన పెట్టి.. అసలు విషయానికి వస్తే రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఈ రోజు లీటరు పెట్రోల్ మీద 38 పైసలు పెంచటంతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు రూ.101.80గా నిలిచింది. మామూలు పెట్రోల్ కు.. ప్రీమియం పెట్రోల్ కు మధ్య శుద్దిలో తేడా ఉందని చెబుతారు. ఇవాళ ప్రీమియం పెట్రోల్.. రేపు మామూలు పెట్రోల్ ధర లీటరు సెంచరీ దాటేసే శుభదినాలుదగ్గర్లోనే ఉన్నాయని చెప్పాలి. తమ పాలనలో అచ్చే దిన్ వస్తుందన్న మోడీ నిజంగానే.. అచ్చే దిన్ అంటే ఏమిటో చూపిస్తున్నారని చెప్పకతప్పదు.