త్రివిక్రమ్ ఆ పని కూడా చేస్తున్నాడా?

దర్శకత్వ పర్యవేక్షణ.. కొందరు సీనియర్, స్టార్ డైరెక్టర్లకు ఇది ఒక సరదా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదలుకుని.. ఈ తరం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరకు చాలామంది ఈ ముచ్చట తీర్చుకున్న వాళ్లే. రాజమౌళి తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ వన్’కు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. ఆయన కథతో తెరకెక్కుతున్న ‘గాలి సంపత్’కు తాజాగా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యత కూడా తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇలా కొందరు అధికారికంగా ‘దర్శకత్వ పర్యవేక్షణ’ క్రెడిట్ తీసుకుంటారు కానీ.. ఇంకొందరు దర్శకులు ఆ క్రెడిట్ తీసుకోకుండా అన్నీ తామై నడిపిస్తుంటారు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా విషయంలో సుకుమార్ ఇలాగే చేశాడని అంటారు. ఆ సినిమాలో ఆయన ముద్ర అలా కనిపిస్తుంది మరి. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇదే పని చేస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ సోమవారమే సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ మాటలు రాశాడంటేనే ఆ చిత్రం ఆయనే తీశాడా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ‘తీన్ మార్’ ఇందుకు ఉదాహరణ. ‘అయ్యప్పనుం..’ రీమేక్‌కేమో ఆయన స్క్రీన్ ప్లే కూడా రాశాడు. ఇక కథేమో మలయాళంది. త్రివిక్రమ్ స్క్రిప్టును అనుసరిస్తూ దర్శకుడు సాగర్ చంద్ర సన్నివేశాలు తీయడమే మిగిలింది.

ఐతే ఈ సినిమా తొలి రోజు షూటింగ్ స్పాట్‌లో త్రివిక్రమ్ కూడా ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో మొత్తం త్రివిక్రమ్ హవానే కనిపించింది. ఆయనే హైలైట్ అయ్యాడు. దర్శకుడు పక్కకు వెళ్లిపోయాడు. తొలి రోజు కాబట్టి త్రివిక్రమ్ ఇలా చుట్టపు చూపుగా వచ్చాడా లేదంటే.. సాగర్‌కు స్టార్లను డీల్ చేసిన అనుభవం లేదని సినిమా అయ్యేంత వరకు కంటిన్యూ అయిపోతాడా అన్న డౌట్లు కలుగుతున్నాయి. ఎలాగూ ఎన్టీఆర్ సినిమా మొదలు కావడానికి టైం పడుతుంది కాబట్టి త్రివిక్రమ్.. అనధికారికంగా దర్శకత్వ పర్యవేక్ష చేస్తూ ఈ సినిమాను పూర్తి చేస్తాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి అందరికీ.