ప్రభాస్‍ వచ్చే వరకు జాగారం చేస్తాడట

మహానటి దర్శకుడు నాగ్‍ అశ్విన్‍ మలి చిత్రాన్ని పాన్‍ ఇండియా సూపర్‍స్టార్‍ ప్రభాస్‍తో ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు దీపిక పడుకోన్‍ కూడా ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది. రాధేశ్యామ్‍ తర్వాత ఆ సినిమానే అనుకుంటూ వుండగా మధ్యలో ఆదిపురుష్‍ వచ్చింది. ఆ తర్వాత వెంటనే సలార్‍ కూడా వచ్చి చేరింది. దీంతో ప్రభాస్‍ అసలు ఈ ఏడాది నాగ్‍ అశ్విన్‍కు డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఎదురయింది. మామూలుగా అయితే దర్శకులు చిరాకు పడి వేరే ఆప్షన్‍ వెతుక్కుంటారు. లేదా ఈలోగా మరో సినిమా మొదలు పెడతారు. కానీ నాగ్‍ అశ్విన్‍ మాత్రం ప్రభాస్‍ ఎప్పుడు వస్తే అప్పుడే సినిమా చేస్తానంటూ ఎదురు చూస్తున్నాడు.

తన దర్శకత్వంలో తదుపరి వచ్చే పూర్తిస్థాయి చిత్రం ఇదేనని అశ్విన్‍ సొంత వారితో స్పష్టంగా చెబుతున్నాడు. అయితే ఈలోగా సమయం వృధా కాకుండా వైజయంతి మూవీస్‍ పతాకంపై సినిమాలు నిర్మిస్తున్నాడు. అశ్వనీదత్‍ జమానా ముగిసింది కనుక ఇప్పటి తరానికి నచ్చే కథలను ఎంచుకుని అశ్విన్‍ తన మామగారి బ్యానర్‍కు కొత్త కళ తీసుకొస్తున్నాడు. అలాగే నెట్‍ఫ్లిక్స్ కోసం పిట్టకథలు సినిమాలో ఒక భాగం డైరెక్ట్ చేసాడు. ప్రభాస్‍ వచ్చేలోగా అలాంటి చిన్న చిన్న ప్రయత్నాలేవైనా చేసుకుంటూ వుంటాడట. తాను తీయబోయే తదుపరి సినిమా మాత్రం ప్రభాస్‍తోనే వుంటుందట.