పవన్ భీషణ ప్రతిజ్ఞ..అంత సీన్ ఉందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఏమనయ్యా అంటే వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ అన్నే రాంబాబును ఎట్టి పరిస్దితిలోను గెలవనిచ్చేది లేదని. మొన్నటి ఎన్నికల్లో ప్రకాశంజిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటి చేసిన రాంబాబు సుమారు 81 వేల ఓట్ల మెజారిటితో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాంబాబును వచ్చే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకుంటానని పవన్ శపథం చేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే గిద్దలూరు నియోజకవర్గంలో ఒక చోట డ్రైనేజి+రోడ్డు సౌకర్యం గురించి వెంగయ్యనాయుడు అనే యువకుడు ఎంఎల్ఏని అడిగాడు. అయితే ఎంఎల్ఏ సదరు యువకునిపై ఆగ్రహం వ్యక్తంచేశారట. కొద్దిరోజుల తర్వాత నాయుడు పురుగులమందు తాగి మరణించాడు. ఇపుడు ఈ విషయం మీదే ఎంఎల్ఏపై పవన్ మండిపోతున్నారు. రోడ్డు సౌకర్యం, డ్రైనేజి అడిగితే వేధిస్తారా ? అంటూ రెచ్చిపోయారు.

రెండురోజుల రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం సందర్భంగా తిరుపతికి వచ్చిన పవన్ అక్కడి నుండి నేరుగా ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. అక్కడ వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. వెంగయ్య అనే యువకుడు జనసేన కార్యకర్తట. తమ పార్టీ కార్యకర్తలపై అధికారపార్టీ ఎంఎల్ఏలు, నేతలు వేధింపులకు దిగితే తాము ఎలా తిప్పికొట్టాలో తమకు బాగా తెలుసన్నారు.

ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో రాంబాబును గెలవనిచ్చేది లేదని శపథం చేశారు. రాంబాబు ఎన్ని కోట్లరూపాయలు ఖర్చుచేసినా సరే తాము మాత్రం అన్నా రాంబాబును గెలవనివ్వమని చాలెంజ్ చేశారు. నిజంగానే రాంబాబును గెలవనీయకుండా పవన్ అడ్డుకోగలరా అన్నదే పాయింట్. ఎందుకంటే ఒకళ్ళు గెలవాలన్నా ఓడాలన్నా నిర్ణయించేది జనాలే కానీ పవన్ కాదు. ఒకళ్ళ గెలుపును అడ్డుకునేంత సీన్ పవన్ కుంటే రెండోచోట్ల పోటిచేసిన పవన్ ఎందుకు ఓడిపోయినట్లు ?

మొన్నటి ఎన్నికల్లో ఎక్కడ ప్రచారం చేసినా ఓ మాట గట్టిగా మాట్లాడేవాడు. ఎట్టి పరిస్ధితుల్లోను జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీయనని. వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో తాను చూస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇఛ్చిన విషయం అందరు చూసిందే. కానీ చివరకు ఏమైంది ? జగన్ను ఆపలేకపోవటం పక్కనుంచితే చివరకు తాను ఒక్కచోటట కూడా గెలవలేకపోయింది వాస్తవం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాంబాబు గెలుపోటములు జనాల చేతిలో ఉందే కానీ తన చేతిలో ఏమీ లేదని పవన్ గుర్తుంచుకోవాలి.