భారత్ దౌత్య నీతి.. ఆ దేశాలకు లక్షల్లో వ్యాక్సిన్ డోస్‌లు


కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో గట్టిగానే పోటీ పడింది ఇండియా. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ల దిశగా జోరుగానే ప్రయోగాలు సాగాయి. భారత్ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ ఇండియాలో భారీ ఎత్తున వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేశాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోస్‌లు ఉత్పత్తి చేశాయి. ఇటీవలే ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాంల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు.

ఏడాది వ్యవధిలో 25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఇందుకోసం భారీ ఎత్తున వ్యాక్సిన్‌ల ఉత్పత్తి జరుగుతోంది. కాగా దౌత్య విధానంలో భాగంగా ఇండియా.. పొరుగున ఉన్న ఆరు దేశాలకు లక్షల డోస్‌ల వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తుండటం విశేషం. ఆయా దేశాల విజ్ఞప్తుల మేరకే భారత్ ఈ దిశగా ఏర్పాట్లు చేసింది.

ముందుగా మాల్దీవులకు కోవిషీల్డ్ (సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి) వ్యాక్సిన్‌ లక్ష డోస్‌లు పంపేందుకు భారత్ సిద్ధమైంది. వ్యాక్సిన్ డోస్‌లను ఐస్ బాక్సుల్లో పెట్టి మాల్దీవులకు పంపారు. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండేలా ఐస్ బాక్సుల్లో పెట్టి మాల్దీవులకు విమానాల్లో వ్యాక్సిన్‌ల డోస్‌లు పంపారు. మాల్దీవులతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీసెల్స్ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు ఏకంగా 20 లక్షల డోస్‌లు పంపనున్నారట.

శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామని ఆ శాఖ తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తయారైన ప్రముఖ వ్యాక్సిన్లన్నింటిలో అత్యంత చౌకైన, నాణ్యమైన వాటిలో ఒకటిగా ‘కోవిషీల్డ్’ ఖ్యాతి పొందింది. ఇండియాలో కూడా ప్రస్తుతం ఎక్కువగా జనాలకు ఇస్తున్నది ఈ వ్యాక్సినే.