సంక్రాంతి తర్వాతా. సినిమాలే సినిమాలు


తెలుగు వారి సినిమా అభిమానం ఎలాంటిదో మరోసారి రుజువువోతంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లు పున:ప్రారంభం అయినప్పటికీ వివిధ సినీ పరిశ్రమల్లో అంతగా సందడి కనిపించడం లేదు. వేరే భాషల్లో ఒక తమిళంలో మాత్రమే, అది కూడా సంక్రాంతికి బాక్సాఫీస్‌లో సందడి కనిపిస్తోంది. మిగతా చోట్ల థియేటర్లలో సందడి అంతంతమాత్రమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఒకటికి నాలుగు సినిమాలు పండక్కి పలకరించాయి. పండుగ తర్వాత కూడా వీటి సందడి కొనసాగుతున్నాయి. కాగా ఈ ఊపు ఇక ముందూ కొనసాగబోతోంది. తర్వాతి వారాల్లోనూ సినిమాలు వరుస కట్టనున్నాయి. అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరిలోనూ పెద్ద ఎత్తునే సినిమాలు రేసులోకి దిగుతున్నాయి. ఇక ఏ వారం కూడా కొత్త సినిమా లేని లోటు ప్రేక్షకులకు కనిపించేలా లేదు. రాబోయేవి చిన్న సినిమాలే అయినప్పటికీ సందడేమీ తక్కువగా ఉండబోదు.

వచ్చే వారాంతంలో అల్లరి నరేష్ సినిమా ‘బంగారు బుల్లోడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23న ఈ చిత్రం విడుదలవుతుంది. ముందు రోజు ‘ఆహా’ ద్వారా ‘సూపర్ ఓవర్’ రిలీజ్ కానుంది. ఇక నెలాఖర్లో రెండు కొత్త చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. 29న యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విడుదల కానుంది. అదే రోజు సుమంత్ థ్రిల్లర్ మూవీ ‘కపటదారి’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాతి వారం మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉప్పెన’ రిలీజ్ కానుంది. అదే రోజు తెలుగులో తొలి జాంబీ మూవీ ‘జాంబీరెడ్డి’ థియేటర్లలోకి దిగుతుంది.

ఇక వేలంటైన్స్ డే వీకెండ్లో ఒకేసారి మూడు చిత్రాలు రేసులో నిలవబోతున్నాయి. ఇప్పటికే ఆ రోజున సందీప్ కిషన్ మూవీ ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’, ఆది సాయికుమార్ చిత్రం ‘శశి’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. కొత్తగా జగపతిబాబు సినిమా ‘ఎఫ్‌సీయూకే’ 12కే రిలీజ్ ఖరారు చేసుకుంది. తర్వాతి వారం సతీశ్ వేగేశ్న సినిమా ‘కోతికొమ్మచ్చి’ విడుదలవుతుంది. మరోవైపు రిపబ్లిక్ డే కానుకగా నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతుందని అంటున్నారు కానీ.. ఇంకా అధికారిక ప్రకటనేమీ రాలేదు. వచ్చే నెల రోజుల్లోనే ఆ సినిమా కూడా రిలీజయ్యే అవకాశముంది. మొత్తంగా రాబోయే నెల రోజుల్లో రెండంకెల సంఖ్యలో కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయన్నమాట.