‘అన్న’కు మూడు తరాల నివాళి

జనవరి 18.. తెలుగవారు మరిచిపోలేని తేదీ. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించి.. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నందమూరి తారక రామారావు మరణించిన రోజిది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లి అప్పుడే 25 ఏళ్లు అయిపోయింది. ఈ సందర్భంగా తెలుగు వారంతా ఆయన్ని తలుచుకుంటున్నారు. నివాళి అర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తోంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి దివంగత నేతకు నివాళులు అర్పించారు. నారా కుటుంబంలో మూడు తరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్, అతడి కొడుకు నారా దేవాన్ష్ కూడా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నాయి.

చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ కలిసి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నగారికి మూడు తరాల నివాళి అంటూ ఈ అరుదైన ఫొటోను తెలుగుదేశం వర్గాలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి. గతంలో చంద్రబాబుతో కలిసి లోకేష్ ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించాడు కానీ.. దేవాన్ష్ కూడా తోడు రావడం ఇదే తొలిసారి. 25వ వర్ధంతి ప్రత్యేకం కావడంతో దేవాన్ష్ కూడా బాబు వెంట వచ్చినట్లున్నాడు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా నివాళి కార్యక్రమాలు చేపడుతోంది. బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి తారక రాముడికి నివాళి అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తన తాతకు నివాళి అర్పించారు. ఐతే కరోనా ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు వస్తారన్న ఉద్దేశంతో తారక్ అక్కడికి రావట్లేదని తెలిసింది.