మౌనికా రెడ్డి నోరు ఎందుకని లేవటం లేదు ?

‘ఆడపిల్లని అని కూడా చూడకుండా దారుణంగా అరెస్టు చేశారు.. తెలంగాణా, ఏపి ప్రభుత్వాలు తమపై కుట్రచేసి కేసుల్లో ఇరుకిస్తున్నాయి..ఒక టెర్రరిస్టును అరెస్టు చేసినట్లుగా మా అక్కను అరెస్టు చేశారు పోలీసులు’ … ఇది మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టు అయినపుడు ఆమె సోదరి భూమా మౌనికారెడ్డి చేసిన గోల. తన అక్క అరెస్టుకు వ్యతిరేకంగా మూడు రోజుల పాటు మౌనిక నానా రచ్చ చేసింది మీడియాలో. తల్లి, దండ్రులు లేని పిల్లలమని తెలిసి తమను వేధిస్తున్నారంటూ సెంటిమెంటు డైలాగులు చాలానే పేల్చింది.

అయితే గడచిన నాలుగు రోజుల నుండి మౌనికారెడ్డి ఎక్కడా కనబడటం లేదు, వినబడటం లేదు. కారణం ఏమిటో స్పష్టంగా తెలీదు కానీ ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ అని వస్తోందట. తన సోదరి గురించి మౌనిక ఎందుకు మాట్లాడటం లేదు ఇపుడు అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అఖిలను ఎవరు కూడా తప్పుడు కేసులో ఇరికించలేదు. వందల కోట్ల రూపాయలు విలువైన భూమి వివాదంలో తన భర్త భార్గవరామ్, అత్త కిరణ్యి, మామగారు మురళి, మరిది చంద్రహాస్ తో కలిసి అఖిల కిడ్నాప్ కు ప్లాన్ చేసిన విషయం బయటపడింది.

అసలు కిడ్నాప్ ఘటన వెలుగు చూడగానే పోలీసులు ముందుగా అరెస్టు చేసిందే అఖిలను. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా, మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత పోలీసులు అఖిలను అరెస్టు చేశారు. అయితే ఆమె సోదరి మౌనిక మాత్రం ఆడపిల్లలమని, తల్లి, దండ్రులు లేనివారమని ఇలా ఏమిటేమిటో మాట్లాడుతూ సెంటిమెంటును పండిద్దామని తెగ ప్రయత్నించింది. అయితే ఆమె మాటలను ఎవరు కూడా నమ్మలేదు.

తన బావ భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాతరెడ్డి కనబడటం లేదని తనకు చాలా ఆందోళనగా ఉందంటూ నానా గోల చేసింది. అయితే బావ, మరుదులిద్దరు తప్పించుకుని తిరుగుతున్నారంటూ పోలీసులు పదే పదే ప్రకటించిన విషయం తెలిసిందే. భార్గవ్ మహారాష్ట్రలో ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జగద్విఖ్యాత్ ఎక్కడున్నాడో మాత్రం ఇంకా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఇదే సమయంలో కిడ్నాప్ గ్యాంగుకు ఇన్ కమ్ ట్యాక్సు అధికారుల్లాగ శిక్షణిచ్చింది, కార్లను సమకూర్చింది మొత్తం అఖిల అత్త, మామలే అని పోలీసులు దర్యాప్తులో బయటపడింది.

అంటే అన్నీ వైపులా తన అక్క అఖిల కిడ్నాప్ కేసులో ఇరుక్కుపోయిందని తెలిసిన తర్వాతే మౌనిక మీడియాకు దొరక్కుండా తిరుగుతున్నట్లు అర్ధమవుతోంది. అక్కే కాదు బావ, తమ్ముడు, బావ తల్లి, దండ్రులు, సోదరుడు కూడా కిడ్నాప్ లో కీలక భాగస్వాములని ఆధారాలతో సహా పోలీసులు బయటపెట్టిన తర్వాత ఇక తానేం చెప్పినా జనాలు నమ్మరని మౌనికారెడ్డికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఆళ్ళగడ్డ, నంద్యాల, హైదరాబాద్ లో ఎక్కడా కనబడటం లేదు. పైగా తన మొబైల్ ఫోన్ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి 19 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఇంకా కీలక నిందితుల కోసం వెతుకుతున్నారు. వాళ్ళు కూడా దొరికిన తర్వాత మొత్తం వ్యవహారమంతా బయటపడితే అప్పుడు అక్కా, చెల్లెళ్ళు ఏమి మాట్లాడుతారో చూడాలి.