ముద్రగడ బీజేపీలో చేరుతున్నాడా ?

అవును ఇపుడిదే ప్రశ్న తూర్పుగోదావరి జిల్లాలో చక్కర్లు కొడుతోంది. కమలంపార్టీ అద్యక్షుడు సోము వీర్రాజు-ముద్రగడ భేటి జరగబోతోందంటు ఒకటే ప్రచారం జరిగిపోతోంది. శనివారం ముద్రగడ ఇంట్లో వీర్రాజు భేటి అవుతున్నారు. నిజానికి ముద్రగడ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుని చాలా కాలమే అయిపోయింది. ఒకవిధంగా మాజీమంత్రి ముద్రగడ అవుట్ డేటెడ్ పొలిటిషీయన్ అనే చెప్పుకోవాలి. ఆయన వల్ల ఏ పార్టీకి కూడా పెద్దగా లాభం ఉంటుందని అనుకునేందుకు లేదు. మరలాంటి ముద్రగడతో వీర్రాజు భేటి అవసరం ఏమిటి ?

ఏమిటంటే ఇక్కడ రెండు సమాధానాలున్నాయి. మొదటిదేమో బీజేపీకి అర్జంటుగా నేతలు కావాలి. పదిమందికి తెలిసిన నేతలు, పది ఓట్లు వేయించగలిగిన నేతల అవసరం కమలంపార్టీకి చాలా ఉంది. అందుకనే ఇతర పార్టీల్లోని నేతలను కూడా ఆపరేషన్ కమలం ఆకర్ష్ లో భాగంగా పార్టీలోకి లాగేసుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో కమలంపార్టీ తరపున పోటీ చేయటానికి చాలామంది నేతల అవసరం ఉంది. అలాంటిది అవుట్ డేటెడ్ నేతలు కాకపోతే ఇపుడు రన్నింగ్ లో ఉండే నేతలు బీజేపీ వైపు ఎందుకు చూస్తారు ?

ఇక ముద్రగడ విషయం చూస్తే ఆయనకు అర్జంటుగా ఏదో ఓ పార్టీ అండ అవసరం ఉంది. ఇపుడంటే ముద్రగడ అవుట్ డేటెడ్ అయిపోయారు కానీ ఒకపుడు ఎంఎల్ఏ, మంత్రి, ఎంపి పదవులు చేసినవారే. తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ మాటే శిలా శాసనంగా వెలిగిన కాలముంది. కాకపోతే ఆయన స్వయంకృతం వల్ల ఇపుడీ పరిస్దితిలో పడిపోయారు. ఎవరితోను సఖ్యత లేకపోవటం, ఏ పార్టీలో ఉన్నా ఏ విషయంలో అయినా తన మాటే చెల్లుబాటు కావాలని పంతానికి పోవటం లాంటి అనేక లక్షణాల వల్ల చివరకు ఏ పార్టీకి కాకుండా పోయారు.

ప్రస్తుతానికి ముద్రగడ కాపు సామాజికవర్గంలో కొంతమందికి మాత్రమే పరిమితమైపోయారు. ప్రతిచిన్న విషయానికి తనింట్లో తలుపులేసుకుని దీక్షలు చేయటంతో అప్పుడప్పుడు హైలైట్ అవుతున్నారు. లేస్తే మనిషిని కానంటూ ఏదో కాలం వెళ్ళదీస్తున్న ముద్రగడను లేచి వచ్చి తమ పార్టీలో చేరాలని కోరుతున్నారట వీర్రాజు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ముద్రగడకు అర్జంటుగా పార్టీ అవసరం. బీజేపీకి ముద్రగడ లాంటి నేతల అవసరం చాలా ఉంది. కాబట్టి ఉభయకుశలోపరి లాగ ముద్రగడ-కమలంపార్టీ రెండింటికి ఉపయోగం జరుగుతుందని అనుకుంటున్నారు. చూద్దాం మరి ముద్రగడ ఏమంటారో ?