సంక్రాంతికి జాంబీలన్నారు.. ఎక్కడ?


‘‘సంక్రాంతికి ఎప్పుడూ అల్లుళ్లొస్తారు.. కానీ ఈసారి మొగుడొచ్చాడు’’.. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఫేమస్ డైలాగ్ ఇది. సంక్రాంతికే సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో ట్రైలర్లో ఈ టైమ్లీ డైలాగ్ బాగా హైలైట్ అయింది. దాన్ని అనుకరిస్తూ ఇటీవల రిలీజైన ‘జాంబీరెడ్డి’ ట్రైలర్లో ‘‘సంక్రాంతికి ఎప్పుడూ అల్లుళ్లొస్తారు.. ఈసారి జాంబీలొస్తున్నారు’’ అనే డైలాగ్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి రేసులోనే నిలపబోతున్న నేపథ్యంలో ఫన్నీగా ఈ డైలాగ్ పెట్టినట్లున్నాడు ప్రశాంత్. పండక్కి ఆల్రెడీ నాలుగు సినిమాలు రేసులో ఉండగా.. ‘జాంబీరెడ్డి’ని కూడా సంక్రాంతి రేసులో నిలబెట్టడం అంరదినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో ఈ సీజన్లో ఐదో సినిమాకు ఛాన్సుందా అని అనుమానం వ్యక్తం చేశారు.

ఐతే ట్రైలర్ రిలీజ్ సమయానికైతే ‘జాంబీ రెడ్డి’ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి, సరైన రిలీజ్ డేట్ ఏది చూసుకుని ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజై వారం గడుస్తున్నా ఇప్పటిదాకా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. సంక్రాంతి సినిమాల సందడి శనివారం ‘క్రాక్’ సినిమాతో మొదలు కాబోతోంది. ఇక్కడి నుంచి ఇంకో ఐదు రోజుల్లో పండగ రాబోతోంది. ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ఖరారవ్వలేదంటే.. ఈ సినిమా పండక్కి రావడమే సందేహం లాగే ఉంది.

ఉన్న సినిమాలకే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో పెద్దగా అంచనాల్లేని ‘జాంబీరెడ్డి’కి థియేటర్లు చాలినంత స్థాయిలో దక్కేలా లేవు. ఈ సినిమా వెనుక ఎవరైనా పేరున్న నిర్మాత ఉంటే థియేటర్లు దక్కించుకోగలిగేవాడేమో కానీ.. ఇది కొత్త నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి థియేటర్లు దొరికేలా లేవు. ఇంత పోటీలో సినిమాను రిలీజ్ చేయడం కష్టమని భావించి చిత్ర బృందం వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.