మందుబాబుల‌కు ఎల‌క్ష‌న్ ఇంక్ వేస్తే..

లాక్ డౌన్ కారణంగా జనాలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.. పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తిండికి కూడా కష్టమై సాయం చేసే చేతుల కోసం ఎదురు చూశాయి ఎన్నో కుటుంబాలు. వారికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో ప్రయత్నించాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలూ ఆర్థిక సాయం అందించాయి. రేషన్ కూడా ఇచ్చాయి. ఇంకా పలు రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇప్పటికే నెలన్నర రోజులు అతి కష్టం మీద గడవగా.. ఇంకా కొన్నాళ్ల పాటు ఈ కష్టాల్ని తట్టుకోక తప్పని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మద్యం దుకాణాలు తెరుచుకుంటే ఎలా జనాలు ఎగబడ్డారో అందరూ చూశారు.

నిన్నటి వరకు తిండికి కష్టపడ్డట్లు చెప్పుకున్న వాళ్లలో చాలామంది వైన్ షాపుల ముందు బారులు తీరారు. తిండికే డబ్బుల్లేని పరిస్థితి ఉంటే.. వీళ్లకు మందు కొట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి వాళ్లకు రేషన్ ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడంలో అర్థమేముందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక ఆసక్తికర ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎన్నికల టైంలో వేసినట్లు వేలిపై ఇంక్ వేయాలని.. ఆ తర్వాత రేషన్, ఇతర సాయం అందించేటపుడు ఆ ఇంట్లో మగవాళ్లందరి వేళ్లు పరిశీలించి.. ఇంక్ లేని పక్షంలోనే సాయం చేయాలని.. ఇంక్ ఉన్నట్లయితే అన్ని రకాల సాయాలు ఆపేయాలని ప్రతిపాదిస్తున్నారు కొందరు నెటిజన్లు. దీనికి మంచి మద్దతే లభిస్తోంది.

ఇలాంటి కష్ట కాలంలో కూడా మద్యపానం అంత ముఖ్యమైనపుడు, దానికి డబ్బులున్నపుడు అలాంటి వాళ్లకు ట్యాక్స్ పేయర్ మనీ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సహేతుకమైందే కదా?