కలియుగం క్లైమాక్స్ ఇదే.. జగన్ సంచలన వ్యాఖ్యలు

కొంత కాలంగా ఏపీలో హిందూ ఆలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ తరహా దాడులను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. దేవుడితో చెలగాటమాడవద్దని, దేవుడితో పెట్టుకుంటే తప్పకుండా శిక్షిస్తాడని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనలపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని జగన్ మండిపడ్డారు. దేవుడి విగ్రహాలతో రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. కలియుగం క్లైమాక్స్ అంటే ఇదేనేమో అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలీస్ మీట్ లో పాల్గొన్న జగన్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందించారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ తరహా ఘటనలను కొందరు ప్రోత్సహిస్తున్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. దేవుళ్ల జోలికి వెళ్లే ధైర్యం ఎవరికి ఉంటటుందని? విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? అని జగన్ ప్రశ్నించారు. దేవుడంటే కొందరికి భయం భక్తీ లేకుండా పోయిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించే సమయంలోనే ఈ తరహా ఘటనలు జరగడం శోచనీయమని జగన్ అన్నారు.

తాము మంచిపనిని తలపెట్టినప్పుడల్లా ఇలాంటి దాడులు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. నాడు-నేడు ప్రారంభించినప్పుడు గుంటూరులో గుడి ధ్వంసం ఘటన జరిగిందని కొందరు రచ్చ చేశారని, ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరో గొడవకు తెరతీశారని విమర్శించారు. తానుచేసే మంచి పనులకు పబ్లిసిటీ రాకూడదనే కొందరు ఈ ధ్వంసరచనకు పూనుకున్నారన్నారని జగన్ ఆరోపించారు.