బీజేపీతో పోటీ పడుతున్న పవన్ ?

అవును వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజం. ఒకవైపు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయటమే టార్గెట్ గా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసుకుంటోంది. తెరవెనుక ఒకవైపు ప్రయత్నాలు చేసుకుంటునే మరోవైపు ఏవో కార్యక్రమాలు, ఏవో ఆరోపణలు, విమర్శలతో నిత్యం మీడియాలో కనబడుతోంది. పనిలో పనిగా అవసరం ఉన్నా లేకపోయినా తిరుపతి నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా పర్యటనలు చేస్తున్నారు నేతలు.

సరే వీళ్ళవస్తలు వీళ్ళు పడుతున్నారని అనుకుందాం. మరి మిత్రపక్షమైన జనసేన ఏమి చేస్తోంది ? జనసేన కూడా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేయాలని పట్టుదలగా ఉంది. పోటీచేసే విషయంలో బీజేపీ చూపుతున్నట్లే జనసేన కూడా తనకున్న అవకాశాలను మద్దతుగా చూపుకుంటోంది. ఇంతవరకు బాగానే ఉన్నా మరి జనాల్లో జనసేన గురించి ప్రచారం ఎలా చేసుకోవాలి ? ఇపుడిదే సమస్యగా మారిపోయింది.

ఇందుకనే ఏవో ఆరోపణలు, విమర్శలతో పార్టీని జనాల్లో చర్చించుకునేట్లుగా పవన్ పెద్ద ప్లానే వేశారు. ఇందులో భాగంగానే మంత్రి కొడాలి నానిని ఎటాక్ చేశారు. రైతు సమస్యలపై గుడివాడలో రోడ్డుషో పెట్టుకున్నారు. కావాలనే అంటే అవసరం లేకపోయినా, అసందర్భమైనా కొడాలిని కెలికారు. దాంతో మరుసటి రెండురోజులు వరుసగా కొడాలి కూడా పవన్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. పవన్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే.

కొడాలిని పవన్ గిల్లి వదిలేసిన కారణంగా మూడురోజుల పాటు పవన్+జనసేనకు మీడియాలో ఫుల్లుగా కవరేజి వచ్చింది. వీర్రాజుకు అంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుపై రెచ్చిపోవటానికి బోలెడన్ని అవకాశాలున్నాయి. కానీ పవన్ మాత్రం జగన్ మాత్రమే టార్గెట్ చేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. నిజానికి బీజేపీ మిత్రపక్షంగా జనసేన కూడా చంద్రబాబును టార్గెట్ చేయాలి. కానీ విచిత్రంగా చంద్రబాబు మీద మాత్రం పవన్ ఆరోపణ, విమర్శ కూడా చేయటం లేదు.

సో జరుగుతున్నది చూస్తుంటే మీడియాలో కవరేజి కోసమనే పవన్ మిత్రపక్షమైన బీజేపీతో పోటి పడుతున్నట్లున్నారు. మార్చి 16వ తేదీకి తిరుపతి లోక్ సభ దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు చనిపోయి 6 మాసాలైపోతుంది. ఈలోగానే ఉపఎన్నిక జరగాలి. జనవరి చివరలో కానీ ఫిబ్రవరి రెండోవారంలో కానీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకనే జనాల్లో నిత్యం తనపార్టీ చర్చల్లో ఉండేవిధంగా పవన్ ప్లాన్ చేసినట్లు అనుమానంగా ఉంది. మొత్తం మీద తన మిత్రపక్షం బీజేపీతోనే పోటీ పడుతున్న విషయం అర్ధమైపోతోంది.