ఇందుకే జనాలు కాంగ్రెస్ ను ఛీ కొడుతున్నారా ?

కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించక్కర్లేదు..పార్టీ నేతలే కాంగ్రెస్ ను ఓడించేస్తారు అనేది పార్టీలో చాలా పాపులర్ డైలాగ్. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే పై వాక్యం నూటికి నూరుపాళ్ళు నిజమ అనిపిస్తోంది. సీనియర్ నేత వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షునిగా ఇస్తే తాను పార్టీలో ఉండనంటూ ఓ బీబత్సమైన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంకేముంది మీడియా అంతా పోటిపడి మరీ వీహెచ్ తో ఇంటర్య్వూలు చేసేస్తోంది. దాంతో ఆయన కూడా రెచ్చిపోయి రేవంత్ తో మొదలుపెట్టి ఢిల్లీలోని పార్టీ నేతల వరకు చాకిరేపు పెట్టేస్తున్నారు.

నిజంగా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే వీహెచ్ కు రేవంత్ కు పోలికలే లేవు. వీహెచ్ ఎంతవరకు మీడియాలోనో లేకపోతే నేతల సమావేశాల్లోనో మాట్లాడగలడంతే. క్షేత్రస్ధాయిలోకి వెళ్ళి జనాలను పెద్దఎత్తున సమీకరించలేడు. పైగా వీహెచ్ కు వయసు కూడా మీరిపోయింది కాబట్టి చురుకుదనం కూడా తగ్గిపోయింది. ఇదే రేవంత్ విషయాన్ని తీసుకుంటే జనాల్లో మంచి క్రేజ్ ఉన్న నేతగా పాపులరయ్యారు. మాటలు కానీ ప్రత్యర్ధులపైన కానీ పంచులతో విరుచుకుపడిపోతారు. తెలంగాణా వ్యాప్తంగా పాపులరైన నేతని నిస్సందేహంగా చెప్పచ్చు. అన్నింటికన్నా ముఖ్యం ఏమిటంటే కేసీయార్ ను నూరుశాతం వ్యతిరేకించే నేత.

వీహెచ్ ఇంకా రాజీవ్ గాంధీ కాలంలోనే ఉండిపోయిన నేత. కానీ రేవంత్ మాత్రం రాహూల్ గాంధీకి మించి కాలంతో పోటీపడుతున్న నేత. మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డి మొత్తం గ్రేటర్ పరిధంతా తిరిగింది వాస్తవం. రేవంత్ తప్ప ఇపుడు సీనియర్లమని చెప్పుకుంటున్న వాళ్ళల్లో చాలామంది అసలు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనబడలేదు. నిజానికి మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో సీనియర్లు సిన్సియర్ గా పనిచేసుంటే కనీసం మరో పది డివిజన్లలో గెలిచేదని పార్టీలో టాక్ నడుస్తోంది. ఓట్లేయటానికి జనాలు సిద్దంగానే ఉన్నా వేయించుకోవటానికి నేతలే రెడీగా ఉన్నట్లు లేదు.

ఇటువంటి పరిస్దితుల్లో రాష్ట్రమంతా తిరిగి గట్టిగా ప్రచారం చేయగలిగి, నేతలను కదిలించగలిగిన అతికొద్ది మంది నేతల్లో రేవంత్ ముందుంటారనటంలో సందేహం అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీ నేతల్లో ఐకమత్యం లేకపోవటమే జనాలను ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ నేతలంతా ఒక్కతాటిపై నిలబడితే ఈరోజు కాకపోయిన రేపైనా మంచిరోజులు వస్తాయని క్రిందస్ధాయి కార్యకర్తలు అనుకుంటుంటే నేతలు మాత్రం మంచిరోజులు మనకు అవసరం లేదన్నట్లుగా గొడవలు పడుతున్నారు. పార్టీ మీద అభిమానం ఉన్నా నేతల తీరు చూసిన తర్వాతే జనాలు ఛీ కొట్టి ప్రత్యామ్నాయన్ని చూసుకుంటున్నారు.