అంత అనుభవం ఉండీ.. ఆ టీడీపీ నేత‌లో ఇంత వైరాగ్య‌మా?

ఆయ‌న‌కు రాజ‌కీయంగా దూకుడు ఎక్కువ‌. సూప‌ర్ సీనియ‌ర్‌గా గుర్తింపు పొందారు. నియోజ‌క‌వ‌ర్గంలో అటు క్లాస్‌.. ఇటు మాస్‌లోనూ ఆయ‌న ప్ర‌త్యేకంగా నిలిచారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీలో మంచి గుర్తింపు సాధించారు. ఫైర్ బ్రాండ్ రాజ‌కీయాల‌కు త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కు తిరుగులేద‌నే పేరు తెచ్చుకున్నారు. పార్టీని ముందుండి న‌డిపించారు. ఆయ‌న ఏమ‌న్నా.. వార్త‌గా నిలిచిన స్థాయి నుంచి ఆయ‌న ఏం చేసినా.. సంచ‌ల‌నంగా మారే ప‌రిస్థితి వ‌ర‌కు స‌ద‌రు టీడీపీ సీనియ‌ర్ నాయకుడు వేసిన అడుగులు అంద‌రిలోనూ ప్ర‌త్యేక‌మైన నాయ‌కుడిగా నిలిచారు.

ఆయ‌నే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వ‌రుస విజ‌యాలు సాధించారు. వాస్త‌వానికి ఇంత‌క‌న్నా ఎక్కువ సార్లు టీడీపీ త‌ర‌ఫున నేత‌లు ఎంతో మంది ఉన్నారు. కానీ, అంద‌రిలాగా ఉంటే.. చింత‌మ‌నేని స్పెష‌ల్ ఏముంటుంద‌ని అనుకున్నారో.. ఏమో.. దూకుడుగా ముందుకు వెళ్లారు. ఇదే ఆయ‌న‌కు మంచో చెడో భారీ ఎత్తున గుర్తింపు తెచ్చింది. అంతేకాదు.. అటు ప‌వ‌న్‌, ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌పైనా ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు భీక‌ర‌మైన కామెంట్లు చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి.. త‌న‌ను ఓడించాలంటూ.. ఇద్ద‌రు నేత‌ల‌కు స‌వాళ్లు రువ్వారు.

ఇలా దూకుడు చూపించిన చింత‌మ‌నేని రాజ‌కీయం.. ఒక్క‌సారిగా యూట‌ర్న్‌తీసుకుంది. గ‌త ఏడాది వైసీపీ యువ నాయ‌కుడు.. అబ్బ‌య్య చౌద‌రిపై ప‌రాజ‌యం పాల‌య్యారు. వాస్త‌వానికి అబ్బ‌య్య‌ను ఓ బ‌చ్చా! అంటూ.. సంబోధించి… త‌న గెలుపును ఎక్కువ‌గా అంచ‌నా వేసుకున్నార‌నే టాక్ ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు ఒక్క‌సారిగా.. చింత‌మ‌నేని వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు త‌న వెంట ప‌దుల సంఖ్య‌లో అనుచ‌రుల‌ను ఉంచుకునేవారు. అంతేకాదు.. తాను ఎక్క‌డికి క‌దిలినా.. ఓ నాలుగు కార్లు, మందీ మార్బ‌లం, వ్య‌క్తిగత భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు.

కానీ, ఇప్పుడు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఎవ‌రు వ‌చ్చి ప‌ల‌క‌రించినా.. ఆయ‌న మౌనం పాటిస్తున్నారు. అయితే.. ఎవ‌రైనా ద‌గ్గ‌ర బంధ‌వులు, ఫ్రెండ్స్ ఇళ్ల‌లో జ‌రిగే.. కార్య‌క్ర‌మాల‌కు మాత్రం హాజ‌రవుతున్నారు. కానీ, ఆ స‌మ‌యంలోనూ ఆయ‌న ఎలాంటి ఆర్భాటాల‌కూ వెళ్ల‌డం లేదు. మ‌రి ఎందుకు ఇలా జీరో అయ్యారు? అనేచ‌ర్చ నియోజ‌కవ‌ర్గంలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే దూకుడు ముందు తాను ఓడిపోయాన‌నే సంకేతాలు ఇస్తున్నారా? అని కొంద‌రు ఆలోచిస్తున్నారు. అయితే.. టీడీపీ సీనియ‌ర్లు మాత్రం.. సైలెంట్‌గా ఉంటూ.. త‌న‌పై సానుభూతి పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు. ఇదే సైలెంట్ మ‌రో మూడుళ్లు లేదా జ‌మిలి వ‌చ్చే వ‌ర‌కు కొన‌సాగిస్తే.. చింత‌మ‌నేనికి మ‌ళ్లీ ఎడ్జ్ ఉంటుంద‌ని చెబుతున్నారు.