కేసీఆర్ కు జగన్ భయపడుతున్నారు:ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు విషయంలో సీనియర్ పొలిటిషియన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు, నాటి జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమకు ఉండవల్లి పలుమార్లు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

పోలవరం విషయంలో నాటి ఏపీ ప్రభుత్వ అలసత్వ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగబోతోందని ఉండవల్లి పలుమార్లు హెచ్చరించారు. ఇక, తాజాగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పైనా పోలవరం విషయంలో ఉండవల్లి పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పోలవరంపై, గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో సీఎం జగన్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గోదావరి నది పై అనుమతులు లేకుండా తెలంగాణ పలు ప్రాజెక్టులు కడుతోందని, అయినా జగన్ నోరు మెదపడంలేదని ఉండవల్లి ఆరోపించారు. జగన్, వైసీపీ నేతల ఆస్తులన్నీ పక్క రాష్ట్రంలోనే ఉన్నాయని, అందుకే ఆ ప్రాజెక్టులపై మాట్లాడటానికి జగన్ భయపడుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ ప్రాజెక్టులపై నోరెత్తితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి.

వృథాగా పోతున్న గోదావరి నీటిని నిల్వ చేసేలా పోలవరం దగ్గర మాత్రమే రిజర్వాయర్ కట్టాలని, వేరే చోట కడితే ఉపయోగం ఉండదని ఉండవల్లి అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని, ఈ విషయంలో కేంద్రాన్ని జగన్ గట్టిగా నిలదీయ లేకపోతున్నారని వ్యాఖ్యానించారు. డీపీఆర్ ప్రకారం పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పెట్టాల్సిందేనని, లేదంటే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉండవల్లి హెచ్చరించారు.

కేసీఆర్ మాటలు విని భయపడితే లాభం లేదని, పోలవరం పూర్తయ్యేవరకూ తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలని జగన్ కు సూచించారు. పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే ఆలోచన మానుకోవాలని, అలా చేస్తే పోలవరాన్ని ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తుపై కేంద్రం ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్రంతో పోలవరం ప్రాజెక్టు పై జరిపిన సంప్రదింపుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని జగన్ ను ఉండవల్లి డిమాండ్ చేశారు.

నిజాలు చెప్పకుండా సీఎం జగన్ జనాలని మభ్యపెడుతున్నారని ఉండవల్లి షాకింగ్ కామెంట్లుచేశారు. తనను కొందరు వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని ఉండవల్లి అన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి బెదిరింపులు ఎన్నో చూశానని అన్నారు.