జమిలి ఎన్నికలకు రెడీ అయిపోతున్న కేంద్రం ?

కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ సునీల్ అరోరా తాజాగా చేసిన ప్రకటన చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సిద్ధమంటు అరోరా చేసిన ప్రకటనతో రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిపెరిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి జమిలి ఎన్నికల విషయమై పదే పదే ప్రస్తావిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ప్రధానమంత్రి సూచన ప్రకారం రాజకీయపార్టీలతో ఎన్నికల కమీషన్ ఇదే విషయమై సమావేశం నిర్వహించింది.

ఆ సమావేశంలో మెజారిటి పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కూడా ప్రస్తావిస్తు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేసింది. అయితే కమీషన్ తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత కూడా మోడి పదే పదే జమిలి ఎన్నికల నిర్వహణను మాత్రం ప్రస్తావిస్తునే ఉన్నారు. తెరవెనుక ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు కానీ హఠాత్తుగా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము రెడీగా ఉన్నట్లు అరోరా చేసిన ప్రకటనతో రాజకీయపార్టీలన్నీ ఆశ్చర్యపోయాయి.

తాజాగా ఎన్నికల కమీషన్ చేసిన ప్రకటనతో తొందరలోనే జమిలి ఎన్నికల నిర్వహణ తప్పదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెతలాగ ప్రధాని పట్టుబడితే జమిలి ఎన్నికలు జరపక తప్పదని అందరికీ అర్ధమైపోతోంది. ఎందుకంటే దేశంలో మెజారిటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఒకసారి మోడి ఆదేశిస్తే ఆ ముఖ్యమంత్రులందరు తమ ప్రభుత్వాలను రద్దు చేసుకుంటారనటంలో సందేహం లేదు.

ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా మమతాబెనర్జీ లాగ కేంద్రాన్ని నూరుశాతం ఎంత మంది వ్యతిరేకిస్తారన్నది అనుమానమే. కాబట్టి అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే మెజారిటి రాష్ట్రాల అసెంబ్లీలు జమిలి ఎన్నికల నిర్వహణకు సానుకూలంగానే స్పందించటం ఖాయమని అర్ధమైపోతోంది. ఇక లోక్ సభలో కూడా ఈ బిల్లు పాస్ అవ్వటం సమస్యే కాదు. కాకపోతే రాజ్యసభలో ఏమన్నా కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే కావచ్చు. దాన్ని కూడా ఏదోలా మ్యానేజ్ చేసేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కాబట్టి మోడి గట్టిగా పడుపడుతున్న నేపధ్యంలో తొందరలోనే దేశంలో జమిలి ఎన్నికలకు రెడీ అయిపోవచ్చు. కాకపోతే జమిలి నేపధ్యంలో వచ్చే ఏడాది జరగాల్సిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలను ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుందా లేదా అన్నదే సస్పెన్సుగా మారింది. ఒకవైపు జమిలి ఎన్నికలు జరపాలని గట్టిగా కోరుకుంటూనే మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుపోవటం వల్ల ఉపయోగం ఉండదు.