వ్యాక్సిన్ వేయించుకునేందుకు మార్గదర్శకాలు

కరోనా వైరస్ టీకా వేయించుకునేందుకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం టీకా వేయించుకోవాలని అనుకున్న ప్రతిఒక్కళ్ళు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాల్సిందే. అయితే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళంతా టీకా వేయించుకోవాలన్న నిబంధనేమీ లేదు. కాకపోతే టీకా వేయించుకుంటే అన్నీ విధాలుగా మంచిదని కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పింది.

ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ విరుగుడు వ్యాక్సిన్ కొద్దిరోజుల్లో మార్కెట్లోకి రాబోతోంది. వ్యాక్సిన్ తయారీపై కృషి చేస్తున్న కంపెనీల కష్టం తొందరలోనే ఫలితాలు ఇవ్వబోతోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారుచేసిన టీకాను జనాలకు ఇస్తోంది. ఇంతకుముందే రష్యాలో తయారైన స్పుత్నిక్ వి టీకా కూడా జనాలకు ఇచ్చారు. మనదేశంలో భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీ తయారుచేస్తున్న టీకా కూడా మార్కెట్లోకి రాబోతోంది.

ఈ నేపద్యంలోనే అందరికీ టీకాలు వేయించటానికి ఈనెల 25వ తేదీలోగా ఏర్పాట్లు చేసుకోమని కేంద్రప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అంటే కేంద్రం ఆదేశాలను చూస్తుంటే ఈనెల 25 తర్వాత ఏరోజైనా సరే కరోనా టీకాను పైన చెప్పిన రెండు ఫార్మా కంపెనీలు కేంద్రానికి అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకనే టీకా వ్యాక్సిన్ నిల్వలకు, పంపిణీకి, టీకా వేయటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని ఆదేశాలొచ్చాయి.

ఈ నేపధ్యంలోనే కేంద్రం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. టీకా కావాలని పేర్లు నమోదుచేసుకున్న వారికి మాత్రమే వేస్తారు. పేర్లు నమోదు చేయించుకున్న సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్లకు అవసరమైన ఎస్ఎంఎస్ లు అందుతాయి. టీకా ఎప్పుడు వేసేది, ఏ చోట వేస్తారు అనే వివరాలను మొబైల్ ఫోన్ కే పంపుతారు. టీకా వేయించుకునేటపుడు ఏదో ఓ గుర్తింపు కార్డు తీసుకెళ్ళటం తప్పనిసరి.

వ్యాక్సిన్ను ముందుగా వైద్య, ఆరోగ్య సబ్బంది, శానిటేషన్ ఉద్యోగులు, పోలీసులు, డాక్టర్లకు ఇస్తారు. వీరితో పాటు 50 ఏళ్ళు దాటినివారు, ఇప్పటికే అనారోగ్యాలతో ఉన్నవారు, చిన్నపిల్లలకు కూడా ప్రాదాన్యత ఇస్తారు. 28 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కళ్ళు రెండు డోసులు వేయించుకోవాలి. రెండో డోసు వేయించుకున్న రెండువారాల తర్వాత మాత్రమే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. మరి పేర్లు నమోదు చేయించుకునేందుకు మనం వెళదామా ?