రజినీని కాపాడుకోవడానికి కూతురొచ్చింది

సూపర్ స్టార్ రజినీకాంత్ వయసిప్పుడు 70 ఏళ్లు. ఆయనకు ఎప్పట్నుంచో అనారోగ్య సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రెండుమూడుసార్లు ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. ఒక దశలో ఆయనకు ప్రాణాలకే ముప్పు కూడా తలెత్తింది. ఆ పరిస్థితుల్లోనే కొన్ని నెలల పాటు సింగపూర్‌లో ఉండి చికిత్స తీసుకుని ప్రాణాపాయం తప్పించుకున్నారు. రెండేళ్లుగా బాగానే కనిపిస్తున్నప్పటికీ ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నది మాత్రం స్పష్టం. అందుకే కరోనా టైంలో రజినీ అత్యంత జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు.

ఆయన ఆరు నెలలకు పైగా ఇంటి నుంచి కాలు అడుగు బయటికి పెట్టలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు ప్రముఖులకు ఏమైందో చూశాక రజినీ అలా భయపడటంలో తప్పేమీ లేదనే అనిపించింది జనాలకు. ఒక దశలో కరోనా భయంతో రాజకీయాల్లోకి రావడంపైనే పునరాలోచనలో పడ్డారు రజినీ.

ఐతే ఈ మధ్య ఆలోచన మార్చుకుని రాజకీయారంగేట్రానికి ముహూర్తం పెట్టేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ‘అన్నాత్తె’ సినిమాను కూడా పూర్తి చేయడానికి ఆయన పూనుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా హైదరాబాద్‌లో పున:ప్రారంభం కావడం విశేషం. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని తన టీంతో కలిసి ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. అత్యంత జాగ్రత్తల మధ్య, ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా రజినీ షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ఐతే వేరే సహాయకుల్ని నమ్ముకుని తండ్రిని వదిలిపెట్టలేక రజినీతో పాటు ఆయన పెద్ద కూతురు, ధనుష్ భార్య ఐశ్వర్య ఉండటం విశేషం.

తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఐశ్వర్య తన పనులన్నీ మానుకుని వెంట వచ్చేసింది. సినిమా సెట్లో రజినీతో పాటు ఐశ్వర్య ఉన్న ఫొటో కూడా ట్విట్టర్లో కనిపిస్తోంది. ఇది చూసి తండ్రి మీద కూతురికి ఉన్న శ్రద్ధ ఏంటన్నది స్పష్టమవుతోందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.