అల్లు వారి రామాయ‌ణం కోసం త్రివిక్ర‌మ్‌

బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్లో రామాయ‌ణం సినిమా తీయ‌బోతున్న‌ట్లు అల్లు అర‌వింద్ ప్ర‌క‌ట‌న చేసి కొన్నేళ్ల‌వుతోంది. కానీ ఆ దిశ‌గా అంత వేగంగా ఏమీ అడుగులు ప‌డ‌ట్లేదు.

వీరి రామాయ‌ణం ప‌ట్టాలెక్క‌డానికి ముందే అదే క‌థ స్ఫూర్తితో ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో అల్లు వారి రామాయ‌ణం ఆగిపోతుందేమో అని వార్త‌లొచ్చాయి. కానీ త‌మ ప్రాజెక్టు విష‌యంలో అర‌వింద్ ప‌ట్టుద‌ల‌తోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి డైరెక్ష‌న్లో ఆయ‌న రామాయ‌ణం తీయాల‌నుకుంటున్నారు. ఇందుకోసం వ‌న‌రులు స‌మీకరిస్తూ నెమ్మ‌దిగా ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేయిస్తున్నారు.

సంపూర్ణ రామాయ‌ణ గాథ‌ను బహు భాష‌ల్లో భారీగా తెర‌కెక్కించాల‌న్న‌ది అర‌వింద్ బృంద ప్ర‌ణాళిక‌. కాగా తెలుగు వెర్ష‌న్ కోసం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సాయాన్ని ఆయ‌న తీసుకున్నార‌ట‌. దీనికి స్క్రీన్ ప్లే రాయ‌డంతో పాటు ర‌చ‌నా స‌హ‌కారం కూడా త్రివిక్ర‌మ్ అందిస్తున్నార‌ట‌.

త‌న త‌ర్వాతి సినిమాల‌కు స్క్రిప్టు రెడీ చేసుకుంటూనే రామాయ‌ణం ప‌ని కూడా చేస్తూ వ‌స్తున్నార‌ట త్రివిక్ర‌మ్. అది ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లే అంటున్నారు. బ‌న్నీ, అర‌వింద్‌ల‌తో త్రివిక్ర‌మ్‌కు మంచి అనుబంధ‌మే ఉంది. ఈ అనుబంధం వ‌ల్లే ఈ ప్రాజెక్టులో త్రివిక్ర‌మ్ భాగ‌మ‌య్యాడంటున్నారు.

మ‌రి రామాయ‌ణ క‌థ‌కు త్రివిక్ర‌మ్ ఎలాంటి ట‌చ్ ఇచ్చాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. వ‌చ్చే ఏడాది అయినా ఈ మెగా ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుందేమో చూడాలి మ‌రి.