మంకు పట్టువల్ల మోడి సర్కార్ కే నష్టమా ?

నూతన వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో నరేంద్రమోడి సర్కార్ మొండి వైఖరి అనుసరిస్తోంది. ఇప్పటికి 14 రోజులుగా ఢిల్లీ-హర్యనా శివార్లలో రైతు సంఘాల ఆందోళనల వల్ల మోడి ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డపేరు వచ్చేసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో మోడి ప్రభుత్వం ప్రిస్టేజికి పోతున్నట్లు అర్ధమైపోతోంది. అందుకనే రైతు సంఘాల ఉద్యమం దేశంలో ఎంతటి అలజడులు సృష్టిస్తున్నా చట్టాలను మాత్రం రద్దు చేసేది లేదంటు స్పష్టంగా చెబుతోంది. దీని ఫలితంగానే మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో రైతులు జరిపిన చర్చలు ఫెయిలయ్యాయి. కేంద్రంతో రైతుల చర్చలు ఫెయిలవ్వటం ఇది నాలుగోసారి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రైతులు కన్నెర్ర చేసిన తర్వాత ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అలాగే అధికారంలో ఉన్న పార్టీకి తర్వాత ఇబ్బందులు తప్పలేదు. ఈ విషయం దేశంలో అనేకసార్లు రుజువైంది. మరి ఈ విషయం తెలిసి కూడా మోడి ప్రభుత్వం చట్టాలను రద్దు చేయటానికి ఎందుకు ఇఫ్టపడటం లేదో అర్ధం కావటం లేదు. తాము చేసిన చట్టాలు రైతుల సంక్షేమానికే అని మోడి చెబుతున్నది నిజమే అయితే మరి అదే రైతులు ఆ చట్టాలను వద్దంటే మాత్రం ఎందుకు వినిపించుకోవటం లేదు ?

ఆందోళన మొదలై ఇన్ని రోజులైనా చట్టంలో సవరణలకు ఓకే అంటోంది కేంద్రం. అయితే సవరణలు కాదు ఏకంగా రద్దే చేయాలని రైతు సఘాలు పట్టుబడుతున్నాయి. కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం జరిగిన భారత్ బంద్ అనుకున్నదానికన్నా సక్సెస్ అయ్యింది. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ లోన కాకుండా యవత్ దేశమంతా బంద్ ను విజయవంతం చేసింది.

రైతు సంఘాలు ఆరోపిస్తున్నట్లుగా కొత్త వ్యవసాయ చట్టాలు అంబానీ, అదానీల వంటి కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగమా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆరోపణల్లో నిజం కాబట్టే చట్టాల రద్దును ప్రభుత్వం ఎందుకింతగా వ్యతిరేకిస్తోంది ? అనే చర్చ పెరిగిపోతోంది. దానికితోడు రైతు సంఘాలతో చర్చించిన అమిత్ కూడా చట్టాల రద్దు కుదరదని చెప్పేసిన తర్వాత సవరణలకు రైతులు అంగీకరించనపుడు ఇక చర్చల వల్ల ఉపయోగమే ఉండదు. మరి రైతులు ఆందోళన ఉధృతం చేస్తే నష్టం మోడి సర్కార్ కే అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది.